థర్డ్ వేవ్ తర్వాతే మళ్లీ షూటింగ్స్ మొదలవుతాయా?

టాలీవుడ్ లో మళ్లీ కరోనా భయం అలుముకుంది. వైరస్ ప్రభావం చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోయినా.. స్టార్స్ అంతా ఇంటికే పరిమితం అవుతున్నారు. ఇప్పటికే పలువురు కరోనా బారినపడి ఐసోలేషన్ లో ఉన్నారు. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా బారినపడి కోలుకున్నాడు. అయినా తను ఇంకా ఇంట్లోనే ఎక్కువ గడుపుతున్నాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా కరోనా అంటుకుంది. ప్రస్తుతం ఆయన కూడా హోం ఐసోలేషన్ లోనే కొనసాగుతున్నాడు. తనని కలిసిన వారిని కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించాడు. ప్రస్తుతం ఈ టాప్ స్టార్స్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

వాస్తవానికి మహేష్ బాబు తాజా మూవీ సర్కారు వారి పాటకు సంబంధించిన షూటింగ్ కొంత బ్యాలనెన్స్ ఉంది. ఫిబ్రవరిలో కూడా మహేష్ బాబు రెస్ట్ తీసుకోనున్నట్లు చెప్పాడు. మార్చి లేదా ఏప్రిల్ లో ఆయన తిరిగి సినిమా షూటింగులకు హాజరయ్యే అవకాశం ఉంది. అటు మెగాస్టార్ చిరంజీవి కూడా సుమారు నెల రోజుల పాటు రెస్టు తీసుకునే అవకాశం ఉంది. ఆచార్య సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన చిరంజీవి గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాల్ని చేయాల్సి ఉంది. బాబి సినిమా సైతం క్యూలో ఉంది. చిరంజీవికి కరోనా సోకడం ఇది రెండోసారి  దీంతో ఆయన మరింత జాగ్రత్త తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్ కరోనా కంప్లీట్ అయ్యే వరకు షూటింగులకు దూరంగా ఉండే అవకాశం ఉంది.

తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఈ మధ్యే రష్యా నుంచి వచ్చాడు. ప్రస్తుతం ఆయన రాజకీయాల మీద ఫోకస్ పెట్టాడు. తాజాగా ఆయన నటిస్తున్న సినిమా హరిహర వీరమల్లు. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది? అనే విషయం పై క్లారిటీ లేదు. అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప-2 సినిమా షూటింగ్ కూడా ఇంకా మొదలు కాలేదు.  అటు ఆర్ఆర్ఆర్ వాయిదా నుంచి ఎన్టీఆర్, రాంచరణ్ ఇంకా తేరుకోలేదు. కొరటాల శివతో జూ. ఎన్టీఆర్ సినిమా చేయాల్సి ఉన్నా.. ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.  అటు ప్రభాస్ కూడా ఇటీవలే ఫారిన్ షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చాడు. కోవిడ్ తర్వాత మళ్లీ షూటింగులకు హాజరయ్యే అవకాశం ఉంది. అటు బాలయ్యకు సంబంధించి ఆహా 2.0 ప్రోగ్రామ్ తో బిజీగా ఉన్నాడు.  రవితేజ కూడా ప్రస్తుతం సినిమా షూటింగులకు బ్రేక్ ఇచ్చాడు.