ఫామ్ హౌస్‌లో యువకుడి మృతి.. కేసీఆర్ షాక్!

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌కు ఎర్రవల్లిలో ఓ ఫామ్ హౌజ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఫామ్ హౌజ్ నుండే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని పలుమార్లు విపక్ష నేతలు విమర్శలు చేస్తూ ఎద్దేవా చేయడం మనం చాలాసార్లు చూశాం. ఇక ఈ ఫామ్ హౌజ్ కారణంగా ఎర్రవల్లి చుట్టుపక్కాల గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతుండటంతో ఆయా ప్రాంతాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తుంటారు. అయితే కేసీఆర్ ఫామ్ హౌజ్‌కు వెళ్లినప్పుడల్లా ఆయన తన వ్యవసాయ క్షేత్రంలో చాలా చలాకీగా కనిపిస్తూ ఉంటాడు. అయితే ఈ ఫామ్ హౌజ్‌లో తాజాగా ఓ కలకలం రేగింది.

కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో ఓ యువకుడు మృత్యువాత పడ్డ ఘటన తాజాగా వెలుగుచూసింది. మంగళవారం నాడు ఎర్రవల్లి పక్కనే ఉండే వరద రాజాపూర్ గ్రామానికి చెందిన ఆంజనేయులు(19) అనే యువకుడు కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో రోజూవారీ కూలి పనికోసం వెళ్లాడు. అయితే అక్కడి అధికారులు ఓ బావి వద్ద చెట్ల పొదలు ఎక్కువగా ఉండటంతో వాటిని తొలగించే పనిని అతడికి అప్పగించారు. ఈ క్రమంలో బావి వద్ద ఉన్న చెట్ట పొదలను తొలగిస్తున్న ఆంజనేయులు అదుపుతప్పతి బావిలో పడిపోయాడు. దీంతో అతడు సాయం కోసం కేకలు, అది విన్న మిగతా కూలీలు, అధికారులు అక్కడి చేరుకుని అతడిని బావిలో నుండి బయటకు లాగారు.

అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు తెలుస్తోంది. దీంతో ఆ యువకుడి కుటుంబ సభ్యులు, బంధువులు కేసీఆర్ ఫామ్ హౌజ్ ఎదుట ఆందోళనకు బైటాయించారు. ఈ విషయం గురించి తెలుసుకున్న కేసీఆర్ ఫామ్ హౌజ్ అధికారులకు ఫోన్ చేసి ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్నారట. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ విషయంపై కేసీఆర్ ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.