పవన్ ఈజ్ బ్యాక్.. ఊర మాస్ పాటతో దుమ్మురేపాడట..!

పవన్ కళ్యాణ్ స్టార్ హీరోనే కాదు.. దర్శకుడు, సింగర్ కూడా. పవన్ కళ్యాణ్ తొలి నుంచి తన సినిమాల్లో ఎక్కువగా జానపద గేయాలు కు చోటు ఇస్తుంటాడు. సొంతంగా తానే పలు పాటలు కూడా పాడాడు. అవి అభిమానులను ఎంతగానో అలరించాయి. మొట్టమొదట తమ్ముడు సినిమా కోసం పవన్ కళ్యాణ్ రెండు జానపద పాటలు పాడాడు. తాటి చెట్టు ఎక్కలేవు..తాటి కల్లు తీయ లేవు..ఈత చెట్టు ఎక్కలేవు..ఈత కల్లు తీయ లేవు..అనే పాటతో పాటు..ఏం పిల్లా మాట్లాడవా.. అనే మరో పాట కూడా పాడారు. ఖుషి సినిమాలో పవన్ పాడిన భయ్ భయ్యే బంగారు రవణమ్మ పాట అభిమానులను ఎంతో అలరించింది.

ఇక జానీ సినిమాలో పవన్ కళ్యాణ్ రెండు పాటలు పాడాడు. నారాజుకాకురా అన్నయ్య, రావోయి మా ఇంటికి పాటలు పాడాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ పాడిన కాటమ రాయుడా కదిరీ నరసింహుడా.. అనే పాట సెన్సేషన్ సృష్టించింది. అజ్ఞాతవాసి లోనూ కొడకా కోటేశ్వరరావు అంటూ పవన్ గొంతు విప్పాడు.

పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా కోసం ఒక ఊర మాస్ పాట పాడాడు. తమన్ సంగీత దర్శకత్వంలో ఇప్పటికే ఈ పాట రికార్డింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. రికార్డింగ్ స్టూడియో లో పవన్ కళ్యాణ్ ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమన్ ఇది వరకే సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక పాట పాడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాట పాడటం కూడా పూర్తయిందని సమాచారం. అతి త్వరలోనే ఈ పాటను అఫీషియల్ గా విడుదల చేసే అవకాశం ఉంది.

 

https://twitter.com/Yudeep_JSP/status/1466792822737014784?s=19