మ‌హేష్ న్యూ ఇయ‌ర్ సెలబ్రేషన్స్‌..ఈసారి అక్క‌డేన‌ట‌..?!

న్యూ ఇయ‌ర్ ద‌గ్గ‌ర ప‌డుతోంది. సామాన్యులు ఎలా చేసుకున్నా సెల‌బ్రెటీలు మాత్రం ఎంతో ఘ‌నంగా న్యూ ఇయ‌ర్ వేడుకుల‌ను జ‌రుపుకుంటారు. అలాగే టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు సైతం ప్ర‌తి ఏడాది ఫ్యామిలీతో విదేశాల‌కు వెళ్లి న్యూ ఇయ‌ర్‌ను సెల‌బ్రేట్ చేసుకుంటారు. ఇక ఈ సారి కూడా కొత్త సంవత్సరానికి గ్రాండ్‌గా ఆహ్వానం ప‌లికేందుకు మ‌హేష్ ఫ్యామిలీ సిద్ధం అవుతోంది.

ప్ర‌స్తుతం మహేష్ స్పెయిన్‌లో ఉన్నారు. అక్క‌డ ఆయ‌న మోకాలికి స్వల్ప సర్జరీ జరిగింది. `స్పైడర్‌` షూటింగ్ స‌మ‌యంలో మ‌హేష్ బాబు మోకాలికి గాయం అయింది. ఆ గాయమే ఇటీవల ‘సర్కారువారి పాట’ సాంగ్‌ షూట్‌లో తిరగబెట్టిందట. దీంతో స్పెయిన్ వెళ్లిన ఆయ‌న‌కు ప్ర‌త్యేక వైద్య బృందం ఆప‌రేష‌న్ చేసింది.

ఇక స్పెయిన్‌లో విశ్రాంతి తీసుకున్న మ‌హేష్‌.. అట్నుంచి దుబాయ్‌ వెళతారు. మహేశ్‌ అక్కడికి చేరుకునే సమయానికి భార్య నమ్రత పిల్ల‌లు గౌతమ్, సితారల‌ను తీసుకుని దుబాయ్‌ వెళతార‌ట‌. ఈ సారి దుబాయ్‌లోనే మ‌హేష్ బాబు ఫ్యామిలీ న్యూ ఇయ‌న్‌ను సెలెబ్రేట్ చేసుకోబోతున్నార‌ట‌.

వెకేషన్‌ ఎంజాయ్‌ చేసి.. వచ్చే జనవరి మొదటి వారంలోవారు హైదరాబాద్‌ చేరుకుంటారని తెలిసింది. కాగా, మ‌హేష్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఆయ‌న పరుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 1న విడుద‌ల కాబోతోంది.