బాస్.. ఏంటీ స్పీడు..షాకవుతున్న కుర్ర హీరోలు..!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం దూకుడు మీద ఉన్నారు. వరుసగా ప్రాజెక్టులను ఓకే చేయడమే కాకుండా.. వేగంగా సినిమాలను ఫినిష్ చేస్తున్నాడు. అంతేకాకుండా ఒకే ఏడాది మూడు సినిమాలను విడుదల చేసేందుకు ప్లాన్ రూపొందించాడు. చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య, గాడ్ ఫాదర్, బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమా 2022 లో విడుదల కానున్నాయి. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఫిబ్రవరి 4వ తేదీన తెరపైకి రానుంది. ఆచార్య విడుదల కాకముందే చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. మరో రెండు నెలల్లో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కానుంది. ఈ సినిమాను వేసవి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఈ డిసెంబర్ లో బాబీ దర్శకత్వంలో ఓ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నాడు చిరంజీవి. ఆగష్టు కల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి దసరా పండుగ సందర్భంగా థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ విధంగా ఒకే ఏడాది చిరంజీవి నటించిన మూడు సినిమాలు విడుదల కానున్నాయి.గత పదిహేనేళ్ల కాలంలో చిరంజీవి హీరోగా నటించిన మూడు సినిమాలు ఒకే సంవత్సరంలో విడుదలైంది లేదు. అలాగే చిరంజీవి ఒక సినిమా షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత అది పూర్తయ్యేంత వరకూ మరో సినిమా షూటింగ్ ప్రారంభించడు. కానీ ఇప్పుడు మాత్రం ఒక సినిమా షూటింగ్ లో ఉండగానే మరో సినిమా లైన్ లో పెడుతున్నాడు.

దసరా తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా భోళా శంకర్ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిరంజీవి భావిస్తున్నారట. అలాగే వెంకీ కుడుముల, మారుతి దర్శకత్వంలో కూడా సినిమాలు చేసేందుకు చిరంజీవి అంగీకరించినట్లు తెలుస్తోంది. చిరంజీవి ఇలా వరుసబెట్టి ప్రాజెక్టులను లైన్ లో పెడుతుండడంతో ఆయన స్పీడు చూసి కుర్ర హీరోలు కూడా కంగు తింటున్నారు.