చరణ్‌ను వెంటాడుతున్న ట్రెయిన్.. ఈసారి కూడానా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రంలో చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాలు ఇంకా రిలీజ్ కాకముందే, చరణ్ తన నెక్ట్స్ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే అఫీషియల్‌గా లాంఛ్ అయిన ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకుంది.

అయితే ఈ సినిమా తొలి షెడ్యూల్‌లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారట దర్శకుడు శంకర్ అండ్ టీమ్. అయితే ఇది ఓ ట్రెయిన్ యాక్షన్ ఎపిసోడ్ అని తెలుస్తోంది. శంకర్ గత చిత్రాల్లో కూడా భారీ ట్రెయిన్ యాక్షన్ ఎపిసోడ్స్‌ను తెరకెక్కించగా, వాటికి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. కానీ.. చరణ్ లాస్ట్ మూవీలో ట్రెయిన్ యాక్షన్ సీక్వెన్స్ ఎలాంటి దారుణమైన ట్రోలింగ్‌ను మూటగట్టుకుందో అందరికీ తెలిసిందే. దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వచ్చిన ‘వినయ విధేయ రామ’లో ట్రెయిన్ ఎపిసోడ్ అంటేనే ఉలిక్కి పడి లేస్తాం. అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఆ సీక్వెన్స్ అంటే తెలుగు ఆడియెన్స్ ఇంకా మరిచిపోలేకపోతున్నారు.

మరి ఇప్పుడు మరోసారి చరణ్ ట్రెయిన్ ఎపిసోడ్ చేస్తున్నారంటేనే ప్రేక్షకుల్లో టెన్షన్ మొదలైంది. శంకర్ టేకింగ్ విషయంలో ఎలాంటి డౌట్ లేకున్నా, ఎందుకో చరణ్ ఇలాంటి ట్రెయిన్ యాక్షన్ ఎపిసోడ్ చేయకపోతే బెటర్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా చరణ్‌ను ట్రెయిన్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఇంకా వెంటాడుతుండటంతో మెగా ఫ్యాన్స్ వర్రీ అవుతున్నారు. మరి ఈ సినిమాలో శంకర్ ట్రెయిన్ ఎపిసోడ్‌ను ఎలా చిత్రీకరించాడో చూడాలి.