అత్యంత విషమంగా సిరివెన్నెల ఆరోగ్యం..!

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా ఆయన సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. సిరివెన్నెల న్యూమోనియా సమస్యతో బాధపడుతుండటంతో 24వ తేదీన ఆస్పత్రిలో చేర్చారు. మొదట్లో పరిస్థితి విషమంగా ఉందని ప్రచారం జరిగినప్పటికీ.. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. సోమవారం కూడా కిమ్స్ ఆస్పత్రి వైద్యులు సిరివెన్నెల ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

సిరివెన్నెల ఐసీయూలో ఉన్నారని, వైద్య బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ మెరుగైన వైద్యం అందజేస్తున్నట్లు వైద్య బృందం పేర్కొంది. కాగా ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మళ్లీ విషమించినట్లు తెలుస్తోంది. ఆయన త్వరగా కోలుకోవాలని సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, అభిమానులు ప్రార్థిస్తున్నారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇప్పటివరకూ తెలుగులో మూడు వేలకు పైగా పాటలు రచించారు. 1984 లో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన జననీ జన్మభూమి సినిమాతో రైటర్ గా సీతారామ శాస్త్రి తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత కె.విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన సిరివెన్నెల సినిమాకు సీతారామశాస్త్రి పాటలు రాశారు. ఆ సినిమాలోని పాటలు అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకోవడంతో అప్పటి నుంచి ఆయనను సిరివెన్నెల సీతారామ శాస్త్రి అని పిలవడం మొదలు పెట్టారు. టాలీవుడ్ లో ఆయన ఒక దిగ్గజ రైటర్ గా గుర్తింపు పొందారు.