కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా అదుపులోకి వచ్చింది.
గత కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 500 లోపుగా నమోదు అవుతుండగా.. నిన్న మాత్రం స్వల్పంగా పెరిగాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 567 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 161 కేసులు నమోదు కాగా.. కర్నూలు జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం.
దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 20,61,959 కి చేరింది. అలాగే గత 24 గంటల్లో 8 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో మృతుల సంఖ్య 14,364 దగ్గర నిలిచింది. అలాగే నిన్నొక్క రోజే 437 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 20,42,818 కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలో 4,777 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, నిన్న రాష్ట్రవ్యాప్తంగా 39,545 కరోనా టెస్ట్లు నిర్వహించారు.