అదే డైరెక్టర్.. అదే నిర్మాత.. వరుసగా మూడో సినిమా.. ఆ స్టార్ హీరో స్టయిలే వేరప్పా..!

కోలీవుడ్ స్టార్ హీరోలలో అజిత్ ఒకడు. ఈతరం హీరోల్లో విజయ్ తో కలిసి అజిత్ నెంబర్ వన్ రేసులో ఉన్నాడు. అభిమానులు అజిత్ ను ముద్దుగా తల అని పిలుచుకుంటారు. మామూలుగా అగ్రహీరోలు ఒక దర్శకుడితో, ఒక నిర్మాతతో సినిమా చేయడానికి ఆ కాంబినేషన్ సెట్ కావడానికి చాలా కాలం పడుతూ ఉంటుంది. మళ్లీ అదే కాంబినేషన్లో సినిమా రావడానికి ఎంతో సమయం పడుతుంది. కానీ అజిత్ స్టయిల్ మాత్రం వేరే. దర్శకుడు గానీ నిర్మాతగానీ నచ్చాడంటే ఇక వరుసగా వారితోనే ఎన్ని సినిమాలు అయినా చేస్తూ ఉంటాడు.

గతంలో సిరుతై శివ దర్శకత్వంలో అజిత్ వీరమ్ సినిమా చేశాడు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో వెంటనే అదే డైరెక్టర్ తో వేదాళం అనే సినిమా చేశాడు. అది కూడా హిట్ కావడంతో వివేగం సినిమా తీశాడు. వీరమ్ మూవీ తెలుగులో కాటమరాయుడిగా రీమేక్ అయింది. అలాగే వేదాళం ప్రస్తుతం చిరంజీవి హీరోగా భోళా శంకర్ అనే పేరుతో రీమేక్ అవుతోంది.

ఇప్పుడు అజిత్ మరోసారి ఇంకో డైరెక్టర్ తో వరసగా మూడో సినిమాను అంగీకరించాడు. అలాగే నిర్మాత కూడా వరుసగా మూడోసారి రిపీట్ అవుతున్నాడు. ఆ దర్శకుడు ఎవరంటే హెచ్. వినోద్. నిర్మాత ఎవరంటే బోనీకపూర్. అజిత్ హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వంలో బోనీ కపూర్ నిర్మాతగా పింక్ రీమేక్ గా నెర్కొండ పార్వై అనే సినిమా వచ్చింది.

ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో మళ్లీ అదే కాంబినేషన్ లో వలిమై సినిమా మొదలు పెట్టాడు అజిత్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. కాగా తాజా సమాచారం ప్రకారం వినోద్ చెప్పిన మరో కథ నచ్చటంతో అజిత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీనికి కూడా నిర్మాత బోనీకపూర్ కావడం విశేషం. ఇందుకు సంబంధించి అఫీషియల్ ప్రకటన కూడా వచ్చింది.