స్పృహలోకి సాయిధరమ్​ .. హెల్త్​ బులెటిన్​ విడుదల..!

సాయిధరమ్ తేజ్​ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆ మేరకు హెల్త్​ బులెటిన్​ను విడుదల చేశాయి. ప్రస్తుతం సాయి ధరమ్​ తేజ్​ స్పృహలోనే ఉన్నారని.. ఆయనకు వెంటిలేటర్​ కూడా తొలగించామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
ప్రముఖ హీరో సాయిధరమ్​ తేజ్​.. వినాయక చవితి పండుగ రోజు బైక్​ ప్రమాదంలో గాయపడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన జూబ్లీ హిల్స్​ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

సాయిధరమ్​ తేజ్​ కాలర్​ బోన్​ విరగడంతో ఆయనకు శస్త్ర చికిత్స నిర్వహించారు. అయితే ఆయనకు ఇప్పటివరకు వెంటిలేటర్​ మీద ఉంచి చికిత్స అందించారు. ఇవాళ ఆయనకు వెంటిలేటర్​ తొలగించినట్టు వైద్యులు పేర్కొన్నారు. సాయి తేజ్ శరీర భాగాలన్ని సక్రమంగానే పనిచేస్తున్నాయని.. అంతర్గత రక్తస్రావం ఏమీ జరగడం లేదని ఇప్పటికే వైద్యులు పేర్కొన్నారు. మరికొన్ని రోజులు ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

తీగల వంతెనపై బైక్​ స్కిడ్​ కావడంతో సాయిధరమ్ తేజ్​ తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. తొలుత ఆయనను మెడికవర్​ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం జూబ్లీ హిల్స్​ అపోలోకు తరలించారు. సాయిధరమ్ తేజ్​ సేఫ్ అని తెలియడంతో ఆయన ఫ్యాన్స్​ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.