సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆ మేరకు హెల్త్ బులెటిన్ను విడుదల చేశాయి. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ స్పృహలోనే ఉన్నారని.. ఆయనకు వెంటిలేటర్ కూడా తొలగించామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
ప్రముఖ హీరో సాయిధరమ్ తేజ్.. వినాయక చవితి పండుగ రోజు బైక్ ప్రమాదంలో గాయపడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన జూబ్లీ హిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
సాయిధరమ్ తేజ్ కాలర్ బోన్ విరగడంతో ఆయనకు శస్త్ర చికిత్స నిర్వహించారు. అయితే ఆయనకు ఇప్పటివరకు వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందించారు. ఇవాళ ఆయనకు వెంటిలేటర్ తొలగించినట్టు వైద్యులు పేర్కొన్నారు. సాయి తేజ్ శరీర భాగాలన్ని సక్రమంగానే పనిచేస్తున్నాయని.. అంతర్గత రక్తస్రావం ఏమీ జరగడం లేదని ఇప్పటికే వైద్యులు పేర్కొన్నారు. మరికొన్ని రోజులు ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
తీగల వంతెనపై బైక్ స్కిడ్ కావడంతో సాయిధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. తొలుత ఆయనను మెడికవర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం జూబ్లీ హిల్స్ అపోలోకు తరలించారు. సాయిధరమ్ తేజ్ సేఫ్ అని తెలియడంతో ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.