ఏపీలో సినిమా టికెట్ల ధరలను నియంత్రిస్తూ ఏపీ ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయంపై థియేటర్ యాజమాన్యాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇలా అయితే మేము థియేటర్లు నడపలేమని యజమానులు చెబుతున్నారు. ఈ సమస్యను సరిదిద్దేందుకు టాలీవుడ్ పెద్దలు చిరంజీవి, ఇతర సీనియర్ నటులు ఏపీ సీఎం జగన్ ను కలిసేందుకు చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు. అయితే సీఎం కార్యాలయం మాత్రం నేడు..రేపు అంటూ వాయిదా వేస్తోంది. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ జగన్ ను కలవడం టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. అరె.. ఇన్ని రోజులుగా మెగాస్టార్ తో పాటు టాప్ టాలీవుడ్ హీరోలు జగన్ ను కలిసేందుకు ప్రయత్నిస్తుంటే అపాయింట్ మెంట్ దొరకలేదు. మరి.. మనోజ్ కు ఎలా దొరికిందబ్బా? అని ఆశ్చర్యపోతున్నారు. అంటే ఏదో జరుగుతోంది అని సినీ పెద్దలు భావిస్తున్నారు. సీఎంతో సమావేశం అయిన తరువాత మనోజ్ ఆ ఫోటోను ట్విట్టర్ లో పోస్టు చేసిన తరువాత వైరల్ అయింది. అది వైరల్ కావడమేమో కానీ.. టాలీవుడ్ టాప్ హీరోలకు తలకొట్టినంత పనైంది. ఎంత ప్రయత్నించినా సీఎం దొరకడం లేదు.. ఒకసారి లీవ్ అంటారు.. మరోసారి ట్రిప్ అంటారు.. ఇంకోసారి బిజీ అని చెబుతారు. . ఇలా ఎన్ని రోజులు పోస్ట్ పోన్ చేస్తారని పరిశ్రమ పెద్దలు ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.
కావాలనే…
వకీల్ సాబ్ సినిమా విడుదల సందర్భంగా సినిమా థియేటర్ నిర్వాహకులు ఇష్టానుసారం టికెట్ ధరలు పెంచేశారు. దీంతో సర్కారుకు కోపం వచ్చింది. అదీ రాజకీయంగా బద్ధ శత్రువైన పవన్ కల్యాణ్ సినిమా సందర్భంగా దోచుకోవడంతో సర్కారు ఫైరైంది. దీంతో టికెట్ ధరలను నియంత్రిస్తూ జీఓను జారీ చేసింది. దీంతో సినిమా కష్టాలు మొదలయ్యాయి. ఆ ధరలు అలాగే ఉంటే సినిమా విడుదల చేసీ ప్రయోజనం లేదనేది సినిమా పెద్దలు. అయితే సర్కారు మాత్రం కావాలనే చేస్తోందని కొందరు టాలీవుడ్ ప్రముఖులు చెబుతున్నారు. ఏది ఏమైనా మనోజ్ ట్వీట్ మాత్రం టాలీవుట్ లో చర్చనీయాంశమైంది.