తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రారంభించిన ప్రజా సంగ్రామ యాత్ర వంద కిలోమీటర్లు దాటింది. దీంతో పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకొని హుజూరాబాద్ ఎన్నికలే లక్ష్యంగా గతనెల 28న బండి సంజయ్ హైదరాబాదులో తన పాదయాత్రను ప్రారంభించారు. మొదటి రోజు అట్టహాసంగా ప్రారంభమైన యాత్ర ఇపుడు వికారాబాద్ జిల్లా మోమిన్ పేట వరకు వచ్చింది. అక్కడికి 100 కిలోమీటర్ల నడక పూర్తవడంతో కార్యకర్తలు, నాయకులు సంబరాలు చేసుకున్నారు.
దూకుడు పెంచిన సంజయ్
టీఆర్ఎస్ పార్టీపై బండి సంజయ్ దూకుడు పెంచారు. ముఖ్యంగా కేసీఆర్ దళితబంధు పథకం ప్రారంభించినప్పటి నుంచీ అగ్రెసివ్ గా ముందుకు వెళుతున్నారు. దళితబంధు పథకం.. దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పినట్లే ఉంటుందని సభలు, సమావేశాల్లో చెబుతున్నారు. రాష్ట్రమంతా దలితబంధు అమలు చేయాలని, రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, కుటుంబ పాలన సాగుతోందని జనాలను ఆకట్టుకునే యత్నం చేస్తున్నారు.
హుజూరాబాద్ గెలిస్తే బండి టాప్ లీడర్
మొన్న దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించడంతో బీజేపీలో జోష్ పెరిగింది. పార్టీ అధిష్టానం కూడా బండిని అభినందించింది. ఇపుడు జరిగే హుజూరాబాద్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించి అధిష్టానానికి గిఫ్ట్ ఇవ్వాలని సంజయ్ ఆలోచిస్తున్నారు. అందులో భాగంగా పాదయాత్ర చేస్తున్నారు. ఆయనకు హై కమాండ్ సపోర్టు కూడా ఉంది. ఒకవేళ హుజూరాబాద్ లో బీజేపీ జెండా ఎగిరితే మాత్రం పార్టీలో బండి టాప్ లీడరుగా మారుతాడని, అప్పుడు అధిష్టానానికి మరింత దగ్గరవుతాడని పరిశీలకులు భావిస్తున్నారు.