రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అంటే తెలియని వారుండరు. `దేవి` సినిమాతో సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈయన.. అతి తక్కువ సమయంలోనే సూపర్ పాపులర్ అయ్యి ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. టాలీవుడ్లోనే కాదు కోలీవుడ్లోనూ అద్భుతమైన స్వరాలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారీయన. ఇక చిన్న, పెద్ద సినిమాలనే తేడాలేకుండా ఒప్పుకున్న ప్రతి సినిమాకు ప్రాణం పెట్టి బాణీలు కట్టి ప్రేక్షకులను రంజింపచేసే దేవిశ్రీ బర్త్డే నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
దేవి శ్రీ ప్రసాద్ 1979 ఆగస్టు 2న ప్రముఖ సిని రచయిత గొర్తి సత్యమూర్తి, శిరోమణి దంపతులకు జన్మించారు. సత్యమూర్తి తన అత్త పేరులోని దేవి, మామ ప్రసాదరావు పేరులోని ప్రసాద్ తీసుకొని ‘దేవిశ్రీ ప్రసాద్’ అని నామకరణం చేశారు. దేవిశ్రీకి చిన్నప్పటి నుంచి సంగీతమంటే ఎంతో ఆసక్తి. నాటి నుండే సంగీత దర్శకుడు కావాలని కలలుకన్నాడు. ఆరో తరగతిలో ఉండగానే..పెద్దయ్యాక ఏమవుతావని స్కూల్లో అడిగితే.. మ్యూజిక్ డెరైక్టర్ని అవుతా అని చెప్పాడు.
ఇక దేవికి సంగీతంపై ఉన్న ఆసక్తిని గమనించిన శిరోమణి గారు.. ప్రముఖ భారతీయ మాండొలిన్ వాద్య నిపుణుడు మాండొలిన్ శ్రీనివాస్ దగ్గర దేవిని చేర్పించారు. దాదాపు 13 ఏళ్ల పాటు మాండొలిన్ నేర్చుకున్న దేవిశ్రీ.. 1999లో 19 ఏళ్ల ప్రాయంలోనే దేవి సినిమాతో సంగీత దర్శకుడిగా మారాడు. ఈ చిత్రం మంచి విజయం సాధించడమే కాదు.. దేవి అందించిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి.
ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ రాక్ స్టార్ గా ఎదిగిన దేవిశ్రీ..రెండు తరాల టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరికీ మ్యూజికల్ హిట్స్ ను అందించి అనేక అవార్డులను అందుకున్నాడు. ఇక మాస్ బీట్ తో కుర్రకారుని, క్లాస్ బిట్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకోవడంలో మహాదిట్ట అయిన దేవిశ్రీ.. స్వరాలే కాదు అడపాదడపా గళం విప్పుతూ, అప్పుడప్పుడూ తెరపైన, స్టేజ్ పైనా డ్యాన్సులు వేస్తూ ప్రేక్షకులకు ఫిదా చేస్తుంటారు. అటువంటి దేవిశ్రీ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుందాం.