ఎక్కడో చైనాలో పుట్టిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి తగ్గుతూ వస్తోంది. భారత్లోనూ పాజిటివ్ కేసులు, మరణాలు తగ్గుతూ వస్తున్నాయి అనుకున్న తరుణంలో.. అనూహ్యంగా కరోనా ఊపందుకుంది.
గత కొద్ది రోజులుగా మళ్లీ నలబై వేలకు పైగా రోజూవారీ కేసులు వస్తున్నాయి. అయితే నిన్న మాత్రం కొత్త కేసులు స్వల్పంగా దిగొచ్చాయి. గత 24 గంటల్లో భారత్లో 38,628 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,18,95,385 కు చేరుకుంది. అలాగే నిన్న 617 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 4,27,371 కు పెరిగింది.
ఇక నిన్న ఒక్కరోజే 40,017 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు దేశంలో కరోనా నుంచి 3,10,55,861 మంది హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే 4,12,153 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కాగా, దేశవ్యాప్తంగా నిన్న ఒక్క రోజే 17,50,081 టెస్టులు నిర్వహించారు అధికారులు.