ఎక్కడో చైనాలో పుట్టిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి తగ్గుతూ వస్తోంది. భారత్లోనూ కరోనా కేసులు, మరణాలు తగ్గుతూ వస్తున్నాయి అనుకున్న తరుణంలో.. మళ్లీ అనూహ్యంగా కరోనా ఊపందుకుంది.
గత కొద్ది రోజులుగా ఇరవై వేలకు లోపుగా నమోదైన రోజూవారీ కేసులు.. మళ్లీ నలబై వేలకు పైగా వస్తున్నాయి. గత 24 గంటల్లో భారత్లో 44,643 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,18,56,757 కు చేరుకుంది. అలాగే నిన్న 464 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 4,26,754 కు పెరిగింది.
ఇక నిన్న ఒక్కరోజే 41,096 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు దేశంలో కరోనా నుంచి 3,10,15,844 మంది హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే 4,14,159 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.