స్పీడు పెంచిన బాలయ్య.. ముహూర్తం ఫిక్స్?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన తాజా చిత్రం ‘అఖండ’ను రిలీజ్‌కు రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మాస్ చిత్రాల స్పెషలిస్ట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ కాంబోలో ఇది హ్యాట్రిక్ విజయం అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇక వారి అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా పోస్టర్స్, టీజర్లు ఉండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే అఖండ చిత్రం రిలీజ్ కాకముందే బాలయ్య తన అభిమానులకు మరో శుభవార్త తెలిపాడు. తన నెక్ట్స్ మూవీని మరో యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో చేయబోతున్నట్లు ఇటీవల ప్రకటించాడు బాలయ్య. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందా అనే అంశంపై ప్రస్తుతం క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాను అక్టోబర్ 1వ తేదీన అధికారికంగా పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందట.

ఈ సినిమాలో బాలయ్యను మరింత పవర్‌ఫుల్‌గా చూపించేందుకు గోపీచంద్ మలినేని అదిరిపోయే సబ్జెక్టును రెడీ చేశాడని తెలుస్తోంది. ఇటీవల మాస్ రాజా రవితేజకు క్రాక్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన గోపీచంద్ మలినేని, మరి బాలయ్య కోసం ఎలాంటి సబ్జెక్టుతో వస్తున్నాడో తెలియాలంటే ఈ సినిమా పూర్తయి రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇకపోతే అఖండ చిత్రంలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో మనల్ని ఎంటర్‌టైన్ చేయనుండగా, ఆయన సరసన అందాల భామ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.