జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు..కారణం ఏమిటంటే..?

ఏపీలోని అనంతపూర్ జిల్లా రాజకీయాల్లో జేసీ బ్రదర్స్‌కు మంచి పట్టుంది. జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్‌గా ఉన్నారు. ఆయనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. హెడ్ కానిస్టేబుల్ ఛత్రునాయక్ ఫిర్యాదు ఆధారంగానే కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. కాగా, తాజాగా తాడిపత్రి మున్సిపాలిటీ రెండో వైస్ చైర్మన్ ఎన్నిక పోలీసుల భారీ బందోబస్తు మధ్య జరిగింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఎలక్షన్‌లో టీడీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి అబ్దుల్ రహీం విజయం సాధించారు.

ఈ క్రమంలో తనపై కేసు నమోదు చేసిన సందర్భంగా జేసీ ప్రభాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాజకీయం అంటే ఏమిటో ఇక నుంచి తాను చూపిస్తానంటూ వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని హెచ్చరిస్తూ మీసం మెలేశారు. టీడీపీ మద్దతు ఇచ్చిన స్వతంత్ర కౌన్సిలర్‌ వైస్‌ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవడం ద్వారా టీడీపీ తన సత్తా ఏమిటో పెద్దారెడ్డికి మరోసారి చూపించిందని పేర్కొన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో తాను కానీ, కొడుకు, భార్య కానీ తమ తడాఖా ఏమిటో జేసీ బ్రదర్స్‌కు చూపిస్తామని ప్రగల్భాలు పలికిన పెద్దారెడ్డి చివరికి బొక్కబోర్లా పడ్డారని ఎద్దేవా చేశారు. మొత్తంగా టీడీపీ అధికార వైసీపీకి గట్టి షాక్ ఇచ్చిందనే చెప్పొచ్చు.