బుల్లితెర నటుడు, జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ప్రముఖ ఛానెల్లో ప్రసారమవుతోన్న శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోలో తెలంగాణ పండుగ బతుకమ్మ, తెలంగాణ భాషను, సంస్కృతిని హైపర్ ఆది కించపరిచాడంటూ ఎల్బీనగర్ ఏసిపి శ్రీధర్ రెడ్డికి తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు.
అయితే వివాదం ముదరడంతో.. హైపర్ ఆది సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు చెప్పారు. తాము కావాలని ఎవరినీ కించపర్చే ఉద్దేశ్యం తమకు లేదన్న ఆయన, ఒక వేళ ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే దానికి నిర్మోహమాటంగా క్షమాపణ కోరుతున్నానని వెల్లడించారు. మరియు ఆంధ్ర, తెలంగాణ అనే బేధాబిప్రాయాలు మా షో లో లేవని ఆయన స్పష్టం చేశారు.
కానీ, వివాదం మాత్రం తగ్గడం లేదు. ఆది క్షమాపణలు చెప్పినప్పటికీ వదిలేది లేదని తెలంగాణ జాగృతి విద్యార్థి సమాఖ్య స్పష్టం చేసింది. ఈ విషయంపై రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్ మాట్లాడుతూ..ఆది క్షమాపణ చెప్పిన తీరు సరిగా లేదని..తన పర్సనల్ పేజీలో ఓ వీడియో పోస్టు చేసి చేతులు దులుపుకునే ధోరణని సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ముందు ముందు ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో చూడాలి.