టాలీవుడ్ స్టార్ హీరోలలో నందమూరి బాలకృష్ణ ఒకరు. నటుడిగానే కాకుండా హిందూపురం ఎమ్యేల్యేగా బాలయ్య ప్రజల మనసులని గెలుచుకుంటున్నారు. ఆపదలో ఉన్న వారి ఆపన్న హస్తంలా నిలిచే బాలయ్య కరోనా సమయంలో చాలా సేవా కార్యక్రమాలు చేపట్టారు. అయితే జూన్ 10 న బాలకృష్ణ బర్త్డే కాగా, ఆ రోజుని అభిమానులు పండుగలా జరుపుకొంటారు. కేక్లు కట్ చేయడం, బాణా సంచాలు కాల్చడం, పలు సేవా కార్యక్రమాలు చేయడం వంటివి చేస్తున్నారు. అయితే , ప్రస్తుతం కరోనా సంక్షోభం నెలకొని ఉన్న తరుణంలో, తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఎవరూ తరలి రావొద్దని నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. “నా ప్రాణ సమానులైన అభిమానులకు” అంటూ సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు.
“ప్రతి ఏటా నా పుట్టినరోజు సందర్భంగా నన్ను కలిసేందుకు నలుదిక్కుల నుంచి తరలివస్తున్న మీ అభిమానానికి సర్వదా విధేయుడ్ని. కానీ ఇప్పుడు కరోనా విలయతాండవం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు బయటికి రావడం అభిలషణీయం కాదు. మీ అభిమానమే నన్ను ఇంతటివాడ్ని చేసింది… ఒక్క అభిమాని దూరమైనా భరించలేను. మీ అభిమానంతో సాటిరాగల ఆశీస్సు లేదు, మీ ఆరోగ్యాన్ని మించిన శుభాకాంక్ష లేదు. మీ కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా గడపడమే నా జన్మదిన వేడుకగా భావిస్తాను. దయచేసి ఎవరూ రావొద్దు” అని బాలయ్య తన ఫ్యాన్స్ కు విజ్ఞప్తి చేశారు.