మరో సారి రియల్ హీరో అనిపించుకున్న సోను..!

రోజు రోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు బాగా పెరుగుతున్నాయి. మరో వైపు ఆక్సిజన్‌ కొరత తో ప్రాణాలు కోల్పోతున్నారు ప్రజలు. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో అభాగ్యులకు అండగా నిలుస్తూ రియల్‌ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్‌. తాజాగా కర్ణాటకలోని సోనూసూద్‌ టీం అంతా కరోనా రోగుల పట్ల సకాలంలో స్పందించి 22 మంది ప్రాణాలని రక్షించారు. బెంగళూరులోని అరక్‌ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ కొరత ఏర్పడింది.

దీనితో వెంటనే అత్యవసరంగా ఆక్సిజన్‌ సిలిండర్లు కావాలంటూ సత్యనారాయణన్‌ అనే ఓ పోలీసు అధికారి కర్ణాటకలోని సోనూసూద్‌ బృందానికి మెసేజ్‌ పంపించాడు. సందేశం అందుకున్న వెంటనే సోనూసూద్‌ స్పందించి, వెంటనే తన బృందం కొన్ని నిమిషాల్లోనే అరక్‌ ఆస్పత్రికి 16 ఆక్సిజన్‌ సిలిండర్లను పంపించారు. టైం కి స్పందించి వారిని వెంటనే సమకూర్చిన తన టీంకి ,ఇంకా వారిని కాపాడిన అందరికీ ధన్యవాదాలు అంటూ సోనూసూద్‌ ప్రకటనలో తెలిపారు.