తెలంగాణ కు మరో కేంద్ర అవార్డు..!

కొద్ది రోజుల క్రితమే తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థలకు జాతీయ స్థాయిలో 12 అవార్డులు ద‌క్కాయి. అంతకు ముందు స్వచ్ఛ సర్వేక్షన్ వంటి అనేక అవార్డులు వచ్చాయన్నారు. ఇలా ఈ మధ్య అవార్డుల మీద అవార్డులు సాధిస్తున్న తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ తాజాగా మరో అవార్డును కైవ‌సం చేసుకుంది. గ్రామ పంచాయతీలలో ఇన్ఫర్మేషన్ అండ్ క‌మ్యూనికేష‌న్‌ టెక్నాలజీ తో పారదర్శకత, సమర్థత, జవాబుదారీ తనం పెంపొందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ వన్ అంటూ కేంద్రం ప్రకటించింది. ఈ- పంచాయతీ నిర్వహణ లో దేశంలోనే ప్ర‌థ‌మ స్థానంలో నిలిచింది. ఈ మేర‌కు కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ ఆర్థిక సలహాదారు బిజయ కుమార్ బెహరా ప్ర‌క‌టించారు.

ప్రతి ఏటా కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ ఈ పంచాయత్ పురస్కారాలను అందచేస్తున్నది. ఈ ఏడాది 2019-20 కి ఈ అవార్డు దక్కింది. దేశంలోని గ్రామ పంచాయతీ లను ఇన్ఫర్మేషన్ అండ్ క‌మ్యూనికేష‌న్‌ టెక్నాలజీ తో పారదర్శకత, సమర్థత, జవాబుదారీ తనం పెంపొందిస్తున్న గ్రామాలను మూడు విభాగాలుగా విభజించింది. పంచాయతీ ఎంటర్ ప్రైజ్ సూట్అప్లికేషన్స్ అండ్ స్టేట్ స్పెసిఫిక్ అప్లికేష‌న్స్‌ లలో 3 విభాగాలుగా విభజించింది. అందులో 2వ విభాగంలో తెలంగాణ మొదటి స్థానం దక్కించుకోగా, రెండో స్థానాన్ని ఆంధ్ర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మూడో స్సస్థానం రాజస్థాన్ కు వచ్చింది. ఈ అవార్డు రావ‌డం ప‌ట్ల రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. కేంద్రానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ అవార్డులు రావ‌డానికి కార‌ణ‌మైన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మార్గ‌ద‌ర్శి సీఎం కెసిఆర్ కి ధ‌న్య‌వాదాలు తెలిపారు. సిఎం కెసిఆర్ కృషి, దార్శ‌నిక‌త వ‌ల్లే ఇదంతా సాధ్య‌ప‌డింద‌ని ఈ సంద‌ర్భంగా కొనియాడారు. అంతేగాక తెలంగాణ ఏర్ప‌డ్డాక‌, గాంధీజీ క‌ల‌లుగ‌న్న గ్రామ స్వ‌రాజ్య స్థాప‌న‌కు సీఎం కెసిఆర్ ప‌ల్లె ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాన్ని తీసుకువ‌చ్చార‌న్నారు. కాగా, ఈ అవార్డులు రావడానికి తీవ్రంగా కృషి చేస్తున్న పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు, తన పేషి, ఇతర రాష్ట్ర స్థాయి నుండి పారిశుధ్య కార్మికుల వరకు ప్రతి ఒక్కరికీ మంత్రి అభినందనలు తెలిపారు.