యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో రామ్ చరణ్తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన 30వ సినిమా ఏ డైరెక్టర్తో చేస్తాడన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
గత కొంత కాలంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో ఎన్టీఆర్ సినిమా ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ.. కొరటాల శివ పేరు తెరపైకి వచ్చింది. దీంతో అందరిలోనూ సస్పెన్స్ నెలకొంది. అయితే ఈ సస్పెన్స్కు తాజాగా తెర దించాడు ఎన్టీఆర్. తన 30వ చిత్రం స్టార్ డైరక్టర్ కొరటాల శివతో చేయబోతున్నట్టు తాజాగా ఎన్టీఆర్ ప్రకటించాడు.
ఈ చిత్రం నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్తో పాన్ ఇండియా చిత్రంగా నిర్మించనున్నారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రం ఏప్రిల్ 29, 2022 వ తేదీన విడుదల కానుంది. కాగా, ఇప్పటికే ఎన్టీఆర్-కొరటాల కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ అవ్వడంతో..తాజా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.