ఎక్కడో చైనాలో పుట్టుకొచ్చిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను అల్లకల్లోలం చేస్తోంది. వైరస్ ప్రభావం తగ్గుతుంది అని అందరూ అనుకునే లోపే మళ్లీ శర వేగంగా విజృంభిస్తోంది. ప్రస్తుతం దేశంలో రోజుకు రెండు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయంటే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇలాంటి తరుణంలో కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సినీ తారలు ప్రజలను కోరుతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. `అసాధారణమైన సమయాల్లో అసాధారణ చర్యలు అవసరం. మాస్క్ ని ధరించండి.. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి.. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి.. తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకొండి.
మనం ఇంతకు ముందే ఇది ఎదుర్కొన్నాం. బాధ్యతాయుతమైన పౌరుడిగా మళ్ళీ కరోనా మహమ్మారిపై యుద్ధం చేద్దాం.` అంటూ మహేష్ కరోనా విషయంలో ప్రజలను అలర్ట్ చేశారు. కాగా, ప్రస్తుతం మహేష్ పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా.. వచ్చే ఏడాది విడుదల కానుంది.