దేశ‌వ్యాప్తంగా క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తున్న‌ది. వైర‌స్ సుడిగాలిలా చుట్టేస్తున్న‌ది. పాజిటివ్ కేసులు, మరణాలు రోజురోజుకూ భయంకరంగా పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 6,206 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, కొత్తగా 29 మంది ప్రాణాలు కోల్పోయారు. మహమ్మారి నుంచి 3,052 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్ర‌స్తుతం రాష్ట్రవ్యాప్తంగా 52,726 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో రోజువారీ కేసులు వెయ్యి దాట‌గా, కొత్తగా.. 1,005 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

ఇదిలా ఉండ‌గా రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నా కొంద‌రు ఇప్ప‌టికీ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మాస్క్‌ల‌ను ధ‌రించ‌కుండా, సామాజిక దూరాన్ని పాటించ‌కుండా వైర‌స్ వ్యాప్తికి కార‌కులుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు క‌రోనాపై సంపూర్ణ అవగాహణ కల్పించాలని టీఆర్ ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ వినూత్న ప్రయత్నం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం ఉద‌యం ఇద్ద‌రూ క‌లిసి గుర్రంపై తిరుగుతూ.. ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి ముస్తాబాద్ చౌరస్తా వరకూ.. ‘మాస్కు ధరించండి.. కరోనాను అరికట్టండి’ అంటూ విధివీదినా తిరిగి ప్రచారం చేశారు. కరోనా బారిన పడ్డ వాళ్లకు ఆస్పత్రుల్లో ఆక్సిజన్, బెడ్స్ సరిపోవడం లేదని అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. సామాజిక దూరం పాటిస్తూ, శానిటైజర్ వాడుతూ మనల్ని మనం రక్షించుకోవాలని సూచించారు. ఇప్పుడు ఈ ప్ర‌చార ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఎంపీపై నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.