మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) క్రమ శిక్షణ సంఘానికి మెగాస్టార్ చిరంజీవి రాజీనామా చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది. నటుడు నరేశ్ అధ్యక్షతన 2019 మార్చిలో ఈ సంఘం ఏర్పాటైన సంగతి తెలిసిందే. ‘మా’ చేసే మంచి పనులు, తీసుకునే నిర్ణయాలు దేవుడెరుగు కానీ.. గొడవలకు మాత్రం కొదువ లేకుండా పోయింది.
ఇప్పటికే మీడియా ముందుకొచ్చి ఎవరికిష్టం వచ్చినట్లుగా వాళ్లు రచ్చ రచ్చ చేసేసి..‘మా’ పరువును బజారున కలిపేశారు. ఈ క్రమంలోనే ‘మా’ కార్యనిర్వాహక సభ్యులు రెండుగా విడిపోగా..కృష్ణంరాజు, చిరంజీవి, మురళీమోహన్, మోహన్ బాబు, జయసుధలు సభ్యులుగా మరో క్రమశిక్షణా సంఘం ఏర్పాటైంది.
ఇంతలోనే కరోనా కూడా వచ్చింది. కోవిడ్ ప్రభావం నుంచి ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే బయటపడే ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు మా ఎన్నికలకు సమయం దగ్గర పడింది. అందుకే ఇన్నాళ్లూ ‘మా’ వ్యవహారాల్లో చురుకుగా వ్యవహరించిన చిరంజీవి క్రమశిక్షణా సంఘానికి రాజీనామా చేశారని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.