ఏపీలో అధికార టీడీపీ అటు ప్రభుత్వ పరంగాను, ఇటు రాజకీయంగాను అష్టకష్టాలు పడుతోంది. బీజేపీ నుంచి సరైన సహకారం లేకపోవడం, నియోజకవర్గాల పునర్విభజన లేకపోవడం, నిధుల లేమితో ఆశించిన మేర హామీలు నెరవేర్చలేకపోవడం, పార్టీలో ఎప్పుడూ లేనంతగా గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడంతో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉంది.
ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని విశ్వప్రయత్నాలు చేస్తోన్న చంద్రబాబు పార్టీ సంస్థాగత కమిటీల పరంగా ఓ కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా ప్రస్తుతం ఉన్న మంత్రి కిమిడి కళా వెంకట్రావుకు బదులుగా మరో జంపింగ్ రెడ్డిగారికి బాధ్యతలు ఇచ్చేలా బాబు డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. వాస్తవంగా చూస్తే కళా వెంకట్రావు కూడా టీడీపీకి దెబ్బేసిన వ్యక్తే.
ఆయన ప్రజారాజ్యం పార్టీలోకి జంప్ చేసి తిరిగి టీడీపీలోకి వచ్చారు. ఇక ప్రస్తుతం కళా మంత్రి అవ్వడంతో ఇప్పుడు ఏపీ టీడీపీ పగ్గాలు మరో సీనియర్కు అప్పగించాలని బాబు డెసిషన్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే గతంలో టీడీపీలో ఉండి తర్వాత కాంగ్రెస్లో పలు పదవులు అనుభవించి, తిరిగి టీడీపీలోకి వచ్చిన మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ ఆనం రామనారాయణరెడ్డిని ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్టు ఏపీ పాలిటిక్స్లో వార్తలు ట్రెండ్ అవుతున్నాయి.
ఎన్నో ఆశలు, హామీలతో టీడీపీలోకి వచ్చిన ఆనం సోదరులను ఇక్కడ పట్టించుకునే వారే లేకపోవడంతో వారు కొద్ది రోజులుగా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. వారు పార్టీ మారేటప్పుడు ఎమ్మెల్సీ ఇస్తానని బాబు హామీ ఇచ్చినా అది నెరవేరలేదు. దీంతో వారు పార్టీ మారడానికి అయినా వెనుకాడమని సన్నిహితులతో చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక ఆనం సోదరులను సంతృప్తి పరిచేలా బాబు రామనారాయణరెడ్డికి నెల్లూరు జిల్లా పగ్గాలు ఇవ్వాలని ముందుగా భావించారు.
అయితే ఇప్పుడు వైసీపీని టార్గెట్ చేసేందుకు రెడ్లకు టాప్ ప్రయారిటీ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఆయన్ను ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నియమించాలని చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్ దాదాపుగా డెసిషన్ తీసుకున్నట్టే కనపడుతోంది. దీనిపై త్వరలోనే ఉత్తర్వులు రానున్నట్టు సమాచారం.