కోడెల‌కు 2019లో గెలుపు భ‌యం ప‌ట్టుకుందా..!

రాజ‌కీయాల్లో బండ్లు ఓడ‌లు – ఓడ‌లు బండ్లు అవ్వ‌డం కామ‌న్‌. ఆ మాట‌కు వ‌స్తే ఈ నానుడి ఒక్క రాకీయాల‌కే కాదు..ఏ రంగానికి అయినా వ‌ర్తిస్తుంది. ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌రావు పేరు చెపితే తెలుగు రాజ‌కీయాల్లో కాక‌లు తీరిన  రాజ‌కీయ నేత‌ల్లో ఆయ‌న కూడా ఒక‌రు. గుంటూరు జిల్లా న‌ర‌సారావుపేట నుంచి 1983 నుంచి వ‌రుస‌గా తిరుగులేని విజ‌యాలు సాధించిన ఆయ‌న కాంగ్రెస్ పాల‌న‌లో బాగా వెన‌క‌ప‌డిపోయారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రెండు సార్లు 2004, 2009 ఎన్నిక‌ల్లో కోడెల త‌న‌కు కంచుకోట లాంటి న‌ర‌సారావుపేట‌లో ఓడిపోయారు. 

నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో త‌న‌కు ప‌ట్టున్న ప్రాంతాల‌ను న‌రసారావుపేట నుంచి విడ‌దీసి ఆయ‌న రాజ‌కీయంగా ఎప్ప‌ట‌కీ కోలుకోలేని దెబ్బ‌తీశార‌న్న అభిప్రాయం అప్ప‌ట్లో వ్య‌క్త‌మైంది. రెడ్ల‌కు బ‌ల‌మైన ప్రాబ‌ల్యం ఉన్న రొంపిచ‌ర్ల మండ‌లాన్ని న‌ర‌సారావుపేట‌లో క‌ల‌ప‌డంతో కోడెల ప‌ట్టు నియోజ‌క‌వ‌ర్గంలో త‌ప్పిపోయింది. ఇక గ‌త ఎన్నిక‌ల‌కు ముందు సైతం ఆయ‌న అక్క‌డ ఓట‌మి భ‌యంతోనే స‌త్తెన‌ప‌ల్లికి మారార‌న్న టాక్ కూడా ఉంది. 

కోడెల అంచ‌నా త‌ప్ప‌లేదు. న‌ర‌సారావుపేట‌లో వైసీపీ గెలిచింది. స‌త్తెన‌ప‌ల్లిలో మాత్రం ఆయ‌న 730 ఓట్ల స్వ‌ల్ప మెజార్టీతో క‌నాక‌ష్టంగా గ‌ట్టెక్కారు. ఇక ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో కోడెల ఎక్క‌డ నుంచి పోటీ చేస్తార‌న్న‌దానిపై గుంటూరు జిల్లాలో అప్పుడే చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయి. కోడెల ఈ సారి న‌ర‌సారావుపేట‌, సత్తెన‌ప‌ల్లిలో పోటీ చేస్తే గెలుపు సులువు కాద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చేశార‌ట‌. 

ఈ క్ర‌మంలోనే నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే కోడెల త‌న‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న గెలుపుతో పాటు ఫ్యూచ‌ర్‌లో త‌న కొడుకు రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు బాట‌లు వేసేందుకు ఆయ‌న త‌మ ఫ్యామిలీకి కంచుకోట‌లా ఓ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఏర్ప‌రుచుకునే ప్లాన్ ర‌చించిన‌ట్టు గుంటూరు జిల్లా రాజ‌కీయాల్లో క‌థ‌నం వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ఉన్న నియోజ‌క‌వ‌ర్గాలు త‌మ‌కు అంత అనుకూలంగా లేక‌పోవ‌డంతో ఆయ‌న వైసీపీని దెబ్బ‌కొట్టేందుకు ఓ మాస్ట‌ర్ ప్లాన్ వేశార‌ట‌.

వైసీపీని స‌మ‌ర్థించే బ‌ల‌మైన రెడ్డి సామాజిక‌వ‌ర్గ ప్ర‌భావం లేకుండా ఉండేలా ఆయ‌న న‌క‌రిక‌ల్లును నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంగా చేసేందుకు పావులు క‌దుపుతున్నార‌ట‌. పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే గుంటూరు జిల్లాలో కొత్త‌గా ఐదు నియోజ‌క‌వ‌ర్గాలు ఏర్ప‌డ‌తాయి. వీటిల్లో ప‌ల్నాడులోనే రెండు వ‌స్తాయి. ఒక‌టి పిడుగురాళ్ల కాగా రెండోది న‌క‌రిక‌ల్లు అని తెలుస్తోంది. న‌క‌రిక‌ల్లును నియోజ‌క‌వ‌ర్గం చేస్తే త‌న సొంత సామాజిక‌వ‌ర్గంతో పాటు టీడీపీకి బ‌లంగా ఉండే బీసీ ఓట‌ర్ల అండ‌తో త‌న‌కు రాజ‌కీయంగా తిరుగులేని పునాది ఏర్ప‌రుచుకోవ‌చ్చ‌న్న‌ది కోడెల ప్లాన్‌.