`ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పాత్రను వైసీపీ సమర్థంగా నిర్వహించలేకపోతోంది`.. ఇది చాలా రోజుల నుంచి మంత్రుల నుంచి విశ్లేషకులందరూ చెబుతున్న మాట. అయితే ఈ విమర్శలు తప్పని ఎప్పుడూ నిరూపించలేకపోయారు ప్రతిపక్ష నేత జగన్. అయితే ఇప్పుడు ప్రతిపక్ష పాత్రను జనసేనాని సమర్థంగా నిర్వహిస్తున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రజాసమస్యపై పోరాటాలు చేస్తూ.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తూ ఆ సమస్యలను పరిష్కరించడంలో విజయం సాధిస్తున్నారు. అలాగే ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో పోటీకి పక్కా ప్రణాళికతో దూసుకుపోతున్నారు.
ప్రజా సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అయితే.. ఆ సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం ప్రతిపక్ష బాధ్యత!! అయితే ఏపీలో ప్రతిపక్ష పాత్రను నిర్వహించడంలో జగన్ విఫలమయ్యారనే వార్తలు కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. దీనిని పోగొట్టుకోవాలని చేస్తున్న పోరాటాలు మైలేజ్ ఇవ్వకపోగా మైనస్లుగా మారుతున్నాయి.
అలాగే పార్టీ నిర్మాణాత్మకంగా సమస్యలు, అంతర్గత కుమ్ములాటలు వైసీపీని దెబ్బతీస్తున్నాయి. దీంతో ప్రతిపక్షం ఉన్నా లేనట్టుగానే ఉంది. అయితే ఈ బాధ్యతను జనసేన అధినేత పవన్.. తన భుజస్కందాలపై వేసుకున్నాడని విశ్లేషకుల అభిప్రాయం.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్ని కేంద్రం.. ప్యాకేజీ ఇస్తామని ప్రకటించగానే ఆ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టాడు పవన్. అంతేగాక కాకినాడలో సభ నిర్వహించి కేంద్ర తీరును ఎండగట్టాడు. అలాగే పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మెగా ఆక్వాఫుడ్ నిర్మాణాన్ని అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో వారి తరఫున నిలిచి.. సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాడు.
అలాగే శ్రీకాకుళంలో ఉద్దానం ఎన్నో ఏళ్లుగా ఉన్న కిడ్నీ సమస్యను తెరపైకి తీసుకొచ్చి వారి ఆవేదనను వెలుగులోకి తీసుకొచ్చాడు. వారి సమస్యను పరిష్కరిస్తానని సీఎం చంద్రబాబు ప్రకటించేలా చేశారు. ఇలా ప్రజాసమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తూ.. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నాడు. ఇటు పార్టీని ప్రజల్లోకి తీసుకెళుతూ.. సంస్థాగతంగా బలోపేతం చేస్తున్నాడు. త్వరలోనే పవన్ ఒంగోలులో సభకు రెడీ అవుతున్నాడు. ఇక్కడ పవన్ ఏ సమస్యపై పవన్ మాట్లాడతాడోనని ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఇక్కడ పవన్ లేవనెత్త సమస్యపై టీడీపీ వర్గాలు సైతం ఉత్కంఠతో వెయిట్ చేస్తున్నాయి.