నల్లధనంపై పోరు, పన్ను ఎగవేత దారులపై కొరడా అంటూ దేశంలో పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ సర్కారుకి సుప్రీం కోర్టు దిమ్మతిరిగి, మైండ్ బ్లాంక్ అయ్యే షాక్ ఇచ్చింది! మీ పద్ధతి చూస్తుంటే.. దేశంలో జనాల్లో తిరుగుబాటు వచ్చేలా ఉందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ మేరకు పెద్ద నోట్ల రద్దుపై దేశ వ్యాప్తంగా వివిధ కోర్టుల్లో నమోదైన కేసులను రద్దు చేయాలని కోరుతూ కేంద్ర అటార్నీ జనరల్ చేసిన వాదనలపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్తో కూడిన ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు నిజంగా కేంద్రానికి చెంపపెట్టు వంటిదేనని విశ్లేషకులు చెబుతున్నారు.
పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా చిల్లర సమస్యలు ఏర్పడ్డాయి. అదేసమయంలో లైన్లలో నిలబడలేక, రద్దు విషయంతో గుండె ఆగిపోయి దేశ వ్యాప్తంగా ఇప్పటికి 30 మందికిపైగా మృతి చెందారు. ఆయా అంశాలపై కేంద్రానికి వ్యతిరేకంగా వివిధ రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. వీటి విచారణ నిలిపివేయాలని కోరుతూ కేంద్రం సుప్రీం గడప తొక్కింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఘాటుగా వ్యాఖ్యానించారు. నోట్ల రద్దుతో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు తమ గోడును చెప్పుకొనేందుకు ఒక వేదిక అవసరమని, లేనిపక్షంలో అల్లర్లు, దొమ్మీలు జరిగినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదని అన్నారు. బ్యాంకుల వద్ద పనులు మానుకుని సామాన్యులు గంటల తరబడి క్యూలలో సొమ్మసిల్లుతుంటే మీరు తీసుకున్న చర్చలేమిటని నిలదీశారు.
నగదు మార్పిడి నిబంధనలు ఎందుకని ప్రశ్నించారు. 4000 నుంచి రూ.2000లకు ఎందుకు తగ్గించాల్సి వచ్చిందని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇటు ప్రభుత్వం పట్టించుకోక, అటు న్యాయస్థానాలు పట్టించుకోకపోతే ప్రజల గోడు ఎవరు వింటారని నిలదీశారు. ఆయా కేసులపై విచారణ జరిగి తీరుతుందని నిష్కర్షగా చెప్పారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న ఏజీ.. బ్యాంకుల వద్ద రద్దీ తగ్గిందని, అవసరమైతే.. మీరే(ప్రధాన న్యాయమూర్తి) ఢిల్లీ రోడ్లపై వెళ్లి పరిశీలించవచ్చని సూచించారు. దీంతో మరింత అగ్గిమీద గుగ్గిలమైన ఠాకూర్.. పరిస్థితి అంతా బాగుంటే.. ఇన్ని కేసులు ఎందుకు వస్తాయని ఎదురు ప్రశ్నించారు. మొత్తం పరిస్థితిని ఈ నెల 25 నాటకి పూర్తిగా వివరించాలని ఆయన ఆదేశించారు.
అయితే, ఇదే సమయంలో జోక్యం చేసుకున్న మరో న్యాయమూర్తి.. ప్రభుత్వం కోరితే.. వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసులను ఢిల్లీకి బదలాయించే అంశంపై పరిశీలిస్తామని వెసులు బాటు ఇవ్వడం ఒక్కటే మోడీ ప్రభుత్వానికి ఒకింత స్వాంతన. ఏదేమైనా.. పెద్ద నోట్ల రద్దు విషయంలో మొదట సుప్రీం కోర్టు కూడా సానుకూలంగా స్పందించినా.. ఇప్పడు ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకత నేపథ్యంలో కేంద్రానికి షాక్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. మరో ముఖ్య విషయం ఏంటంటే..ఇప్పుడున్న పరిస్తితి డిసెంబరు 30తో పరిష్కారం అయ్యే సూచనలు కనిపించడం లేదనే వార్తలు వస్తున్న నేపథ్యంలోను, దేశ వ్యాప్తంగా వ్యాపారాలు దెబ్బతిన్న పరిస్థితిలోనూ కేంద్రంపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం కనిపిస్తోంది.