చంద్రబాబు మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి రోజుకో వార్త ప్రచారంలోకి వస్తోంది. పార్టీలోని సీనియర్లకు ఈ సారి మంత్రి పదవులు ఖాయమని కొన్నాళ్లు ప్రచారం జరగ్గా.. కాదు, వైకాపా నుంచి జంప్ చేసిన ఎమ్మెల్యేలనే మంత్రి వర్గం లోకి తీసుకుంటారని కొన్నాళ్లు ప్రచారం సాగింది. ఇక, ఇప్పుడు తాజాగా వచ్చిన సమాచారం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది! వైకాపా నుంచి జంప్ చేసి సైకిల్ ఎక్కిన వారిని కేబినెట్లోకి తీసుకుంటే ఎదురయ్యే రాజ్యాంగ సమస్యల గురించి గవర్నర్ నరసింహన్ రెండు రోజుల కిందట చంద్రబాబుకు వివరించిన నేపథ్యంలో ఆ విధంగా రాజ్యాంగ సమస్యలు ఎదురుకాకుండా ఉండేలా పక్కా ప్లాన్తో చంద్రబాబు దూసుకుపోవాలని డిసైడ్ అయ్యారట.
జంపింగ్లకు మంత్రి పదవులు ఇచ్చే విషయంలో తన ప్లాన్ సక్సెస్ అయితే ఇక తిరుగు ఉండదని, తనను ఎవరూ ఏమీ అనలేరని కూడా చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అదేంటంటే.. తనను నమ్ముకుని టీడీపీలోకి వచ్చిన జంపింగ్ల్లో ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చేసి, తర్వాత వారి వారి ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయించి తిరిగి ఎన్నికల్లో పోటీ చేయించాలని డిసైడ్ అయ్యారట బాబు. ఇలా చేయడం వల్ల ఇటు పొలిటికల్గా అటు రాజ్యాంగం పరంగా కూడా ఎలాంటి చిక్కులూ ఉండబోవనేది బాబు వ్యూహమని తెలిసింది. అయితే, వైకాపా నుంచి జంప్ చేసి వచ్చిన కేవలం ఇద్దరికి మాత్రమే ఈ ఛాన్స్ ఇవ్వాలని బాబు భావిస్తున్నారట.
వారి పేర్లను కూడా బాబు డిసైడ్ చేశారని, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఆళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియలను మంత్రి వర్గంలోకి తీసుకోవాలని బాబు భావిస్తున్నారని తెలుస్తోంది. వీరిద్దరికీ వారి వారి నియోజకవర్గాల్లో మంచి పేరుందని, అలాగే, వారితో రాజీనామా చేయించి తిరగి ఎన్నికలకు వెళ్లినా ఈజీగా వాళ్లు గెలుస్తారని చంద్రబాబు భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే వారిని రాజీనామా చేసే కండిషన్తో కేబినెట్లోకి తీసుకోవాలని భావిస్తున్నారట. ఇదే సమయంలో వారి నియోజకవర్గాల్లో ఇప్పటికే బలంగా ఉన్న టీడీపీ నేతలనూ చంద్రబాబు సంతృప్తి పరచాల్సిన అవసరం ఉంది.
ఆళ్లగడ్డలో టీడీపీ సీనియర్ నేత గంగులుకి భవిష్యత్తులో ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పి, రాంపుల్లారెడ్డిని బుజ్జగించడం, అద్దంకిలో కరణం బలరామకృష్ణమూర్తి ని లైన్లో పెట్టడం ద్వారా ఈ ఇద్దరినీ తిరిగి గెలిపించుకోవచ్చని చంద్రబాబు భావిస్తున్నారట. ఈ వ్యూహం ఫలిస్తే.. రానున్న ఈ ఇద్దరు జంపింగ్లకు మంత్రి పదవులు ఖాయమని తెలుస్తోంది. అయితే, దీనిపై బాబు ఇంకా కసరత్తు చేస్తున్నారని సమాచారం. ఏదేమైనా.. మరికొన్ని వారాల్లోనే జరుగుతుందని భావిస్తున్న విస్తరణ కొలిక్కి వచ్చేదాకా సస్పెన్స్ కొనసాగనుంది.