గత ఎన్నికల్లో చివరి క్షణంలో బీజేపీ నుంచి గెలిచిన పైడికొండల మాణిక్యాలరావు దేవాదాయ శాఖా మంత్రిగా గెలిచారు. ఏపీలో దేవాదాయ శాఖకు సంబంధించిన అన్ని వ్యవహారాలు ఆయన కనుసన్నల్లోనే జరుగుతుంటాయి. అయితే ఆయన శాఖకు సంబంధించిన ఓ గుడి విషయంలో మాత్రం ఆయన పెత్తనం ఉండదట. ఆ గుడి విషయంలో సంబంధిత శాఖాధికారులు కూడా మాణిక్యాలరావును లైట్ తీస్కొంటారట.
మంత్రిగా బాధ్యతలు తొలి ఏడాది నుంచి ఇప్పటి వరకు మాణిక్యాల రావు దుర్గగుడి వ్యవహారాల్లో పెద్దగా జోక్యం చేసుకున్నట్లు కనిపించదు. ఈ ఒక్క గుడి విషయంలో మాత్రం కృష్ణా జిల్లాకు చెందిన మంత్రులదే పెత్తనం అట. ఈ జిల్లా మంత్రుల ఒత్తిడితో ఇంద్రకిలాద్రీ మీద మాత్రం పైడికొండల పెత్తనానికి అధికారులు ఏమాత్రం సహకరించరన్న టాక్ కూడా ఉంది.
ఇక్కడ తాజాగా జరిగిన ఓ కార్యక్రమానికి పైడికొండల దంపుతులు అమ్మవారికి శేషవస్త్రాలు సమర్పించాల్సి ఉన్నా జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా దంపతులు అమ్మవారికి శేషవస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత కూడా దుర్గగుడి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని పైడికొండలను ఈ జిల్లా మంత్రులు సుతిమెత్తగా హెచ్చరించారనే వార్తలు కూడా వస్తున్నాయి.
తాజాగా దసరా ఉత్సవాల నేపథ్యంలో బుధవారం జరిగిన సమీక్షకు మంత్రికి సమాచారం కూడా ఇవ్వలేదని టాక్. ఆయన వెలగపూడిలోనే ఉన్నా దుర్గగుడిలో జరిగిన సమీక్ష గురించి మాత్రం తెలియదట. వరుసగా నాలుగేళ్ల నుంచి దుర్గగుడి పాలన వ్యవహారాలపై మంత్రి సైతం పెద్దగా ఆసక్తి చూపకపోవడానికి రాజకీయ ఒత్తిళ్లే కారణమని తెలుస్తోంది