వెజిటేబుల్ రాగి ఇడ్లీ… రాగి పిండి, వెజిటేబుల్స్ కలిసి చేసే ఈ ఇడ్లీలు చాలా రుచికరంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. ఇడ్లీలను తయారు చేయడం కూడా చాలా సులభం. అలాగే వీటిని పిల్లలకు ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. అలాగే వీటిని తయారు చేయడానికి పిండి రుబ్బే పని కూడా లేదు. క్షణంలో వీటిని తయారు చేసుకోవచ్చు. రుచి, ఆరోగ్యం అందించే ఈ వెజిటేబుల్ రాగి ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
1.ఒక కప్పు ,రాగి పిండి
2.ఒక కప్పు ,బొంబాయి రవ్వ
3.ఒక కప్పు ,పెరుగు
4.ఉప్పు తగినంత
5.వంట సోడా ,పావు టీ స్పూన్
6.చిన్నగా తరిగిన క్యాప్సికం
7.తరిగిన క్యారెట్
8.కొత్తిమీర
9.నూనె అరటేబుల్ స్పూన్
10.ఆవాలు అర టీ స్పూన్
11.చిన్నగా తరిగిన కరివేపాకు ఒక రెమ్మ
తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెలో రాగి పిండిని తీసుకోవాలి. తర్వాత రవ్వ, పెరుగు, ఉప్పు వేసి కలపాలి. తర్వాత దీనిని అరగంట పాటు నానబెట్టాలి. ఆ తర్వాత ఇందులో వంట సోడా, క్యాప్సికం, కొత్తిమీర, క్యారెట్ వేసి కలపాలి. తరువాత కళాయిలు నూనె వేసి వేడి చేయాలి. ఆ తరువాత ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి. ఈ తాలింపును పిండిలో వేసి కలపాలి. ఆ తర్వాత వీటిని ఇడ్లీ వేసినట్లు ఇడ్లీ పాత్రలు వేసి మూత పెట్టాలి. 15 నిమిషాలు పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటిని బయటకు తీసి ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత ఇడ్లీలను తీసి తినవచ్చు. ఇవి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.