టిక్కెట్ రేట్లు పెంచుకునేందుకు బ్యాండ్ వేసి అడ్డంగా దొరికేశారు… భోళాశంక‌ర్‌కు బిగ్ షాక్‌..!

ప్రముఖ నటుడు చిరంజీవి సినిమా భోళాశంకర్ సినిమా టికెట్ల ధరల పెంపు పై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చింది. టికెట్ ధరలను పెంచాలంటే ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన 11 డాక్యుమెంట్లను ఆ సినిమా నిర్మాతలు సమర్పించలేదని ఏపీ ప్రభుత్వం తెలిపింది. అందువల్ల ఏపీలో భోళా శంకర్ టికెట్ ధరలు పెంచేందుకు అనుమతి లేనట్లు ఏపీ ప్రభుత్వం పేర్కొంది. రూ.101 కోట్లతో సినిమాలు నిర్మించినట్టు నిర్మాతలు చెప్పారు కానీ అందుకు అవసరమైన పత్రాలను నిర్మాతలు ఇవ్వాల్సి ఉంటుందని ఏపీ ప్రభుత్వం చెప్పింది.

సినిమా నియంత్రణ చుట్టం ప్రకారం ఏపీలో 20 శాతం షూటింగ్ చేసినట్లు నిర్మాతలు ఆధారాలు సమర్పించలేదని ఏపీ ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా డైరెక్టర్, హీరో, హీరోయిన్‌ల‌ రెమ్యూనరేషన్ కాకుండా సినిమా నిర్మాణానికి రూ.100 కోట్లు ఖర్చు పెట్టినట్లు నిరూపించే పత్రాలను దరఖాస్తుతో జత చెయనందుకు అనుమతి నిరాకరిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలియజేసింది. అన్ని వివరాలతో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి అన్ని సవ్యంగా ఉన్నట్లయితే టికెట్ ధరలు పెంచుకునే విషయం పరిశీలిస్తామని తెలియజేసింది.

గతంలో చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాకు టికెట్ ధరల పెంచుకునే వెసుల‌బాటు ఏపీ ప్రభుత్వం కల్పించిందనే విషయాన్ని ఏపీ ప్రభుత్వం గుర్తు చేసింది. అప్పుడు ఆ సినిమాకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఏపీ ప్రభుత్వానికి నిర్మాతలు అందించారని పేర్కొంది. ఇప్పుడు భోళాశంకర్ నిర్మాతలు ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి డాక్యుమెంట్లను సమర్పించలేదని కాబట్టి టికెట్లు ధరలను పెంచుకునే విసులుబాటు లేదని ఏపీ ప్రభుత్వం తెలియజేసింది.