టీడీపీలోకి కీలక నేత..మదనపల్లెలో పసుపు జెండా ఎగరనుందా?

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం ఇప్పుడుప్పుడే బలపడుతుంది. పేరుకు టి‌డి‌పి అధినేత చంద్రబాబు సొంత జిల్లా అయినప్పటికి ఇక్కడ వైసీపీ హవా ఎక్కువ. గత ఎన్నికల్లో 14 స్థానాల్లో 13 స్థానాలు వైసీపీ గెలుచుకుంది. పూర్తిగా జిల్లాలో వైసీపీ డామినేషన్ ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాలో టి‌డి‌పి పుంజుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు.

అటు నారా లోకేశ్ పాదయాత్ర వల్ల కూడా జిల్లాలో పార్టీకి ఊపు వస్తుంది. జిల్లాలో గత మూడు ఎన్నికల నుంచి గెలవని నియోజకవర్గంగా ఉన్న మదనపల్లెలో టి‌డి‌పి ఈ సారి ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ముందుకెళుతుంది. 2004లో ఇక్కడ టి‌డి‌పి గెలిచింది. 2009లో కాంగ్రెస్ గెలవగా, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. ప్రస్తుతం వైసీపీ నుంచి నవాజ్ బాషా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయనపై వ్యతిరేకత ఎక్కువ ఉంది. కాకపోతే ఆ వ్యతిరేకతని టి‌డి‌పి క్యాష్ చేసుకోవడంలో అంత సక్సెస్ అయినట్లు కనిపించలేదు. టి‌డి‌పి ఇంచార్జ్ దొమ్మాలపాటి రమేష్ యాక్టివ్ గానే పనిచేస్తున్నారు గాని..నియోజకవర్గంలో ఇంకా బలపడాలి.

అయితే ప్రస్తుతం లోకేశ్ పాదయాత్ర మదనపల్లెలోనే జరుగుతుంది. ఈ క్రమంలోనే పార్టీలోకి కాంగ్రెస్ కీలక నేత షాజహాన్ బాషాని టి‌డి‌పిలో చేర్చుకున్నారు. 2009లో ఈయన కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే బాషా రాకతో మదనపల్లెలో టి‌డి‌పికి కాస్త బలం పెరుగుతుందనే చెప్పాలి. ముఖ్యంగా ముస్లిం ఓటర్లలో కాస్త పట్టు వస్తుంది.

అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో ఈ సీటు ముస్లిం అభ్యర్ధికి ఎలా వస్తుందనే ఆలోచన చంద్రబాబు చేస్తున్నారు. రమేష్ కు ఏదొక కీలక పదవి ఇచ్చి..మదనపల్లెలో ముస్లిం అభ్యర్ధిని బరిలో దింపే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు షాజహాన్ బాషా టి‌డి‌పిలో చేరారు కాబట్టి..ఆయనకు సీటు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.