ఇటీవల టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తుంది. అభిమానుల కోరిక మేరకు సూపర్ హిట్ అయిన పాత సినిమాలను రీ రిలీజ్ చేస్తూ నిర్మాతలు సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే పోకిరి, జల్సా, ఘరానా మొగుడు, బిల్లా, చెన్నకేశవ రెడ్డి, ఖుషీ సినిమాలు విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. కోట్లలో వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఈ రీ రిలీజ్ ట్రెండ్లోకి తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన `గ్యాంగ్ లీడర్` మూవీ వచ్చి చేరింది.
విజయ బాపినీడు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో చిరంజీవి, విజయశాంతి జంటగా నటించారు. 1991లో మే 9న విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. చిరంజీవికి మాస్ ఇమేజ్ పటిష్టం కావడానికి ఈ సినిమా విజయం ఎంతగానో దోహదపడింది. ఇకపోతే 90వ దశకంలో రికార్డులు తిరగరాసిన ఈ సినిమా.. మెగా ఫ్యాన్స్ కోసం మార్చి 4వ తేదీన రీ రిలీజ్ చేశారు.
కానీ, ఆశించిన స్థాయిలో ఈ సినిమాను అభిమానుల నుంచి రెస్పాన్స్ రాలేదు. నేటికీ మూడు రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ఇప్పటి వరకు కేవలం రూ. 40 లక్షల గ్రాస్ ని సొంతం చేసుకుందట. తన సూపర్ హిట్ సినిమాకు ఇంత తక్కువ వసూళ్లు రావడం అంటే.. చిరంజీవికి ఘోర అవమానం అనే చెప్పాలి. మెగా ఫ్యాన్స్ గ్యాండ్ లీడర్ ను సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లే ఇలా జరిగిందట. ’వాల్తేరు వీరయ్య’ చిత్రం 50 రోజుల సెలెబ్రేషన్స్ ఊపులో అభిమానులు ఉన్నారు. ఇలాంటి టైమ్ లో విడుదల అవ్వడం వల్ల గ్యాంగ్ లీడర్ కు పెద్ద దెబ్బే పడింది.