ఆ వ్యాధి వ‌ల్ల ఒంటరిగా ఎన్నో రోజులు ఏడ్చా.. మమతా క‌ష్టాల‌కు క‌న్నీళ్లాగ‌వు!

మమతా మోహన్ దాస్.. ఈ బ్యూటీ క‌ష్టాలు వింటే క‌న్నీళ్లాగ‌వు. త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఎక్కువ‌గా సినిమాలు చేసిన మ‌మ‌తా.. యంగ‌దొంగ మూవీతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయింది. ఆ త‌ర్వాత ప‌లు సినిమాల్లో మెరిసింది. కానీ, స‌రైన గుర్తింపు ద‌క్క‌లేదు. కానీ, మ‌ల‌యాళంలో మాత్రం బాగానే నిల‌దొక్కుకుంది. అయితే కెరీర్ స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతున్న స‌మ‌యంలో మ‌మ‌తా క్యాన్సర్ బారిన ప‌డింది. 2010 నుండి హాడ్కిన్స్ లింఫోమాతో పోరాడి కోలుకుంది.

2013 ఏప్రిల్‌లో క్యాన్సర్ జబ్బు తిరగబెట్టింది. తిరిగి వైద్యం చేయించుకుని క్యాన్సరు ముక్తురాలైంది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ కెరీర్ పై ఫోక‌స్ పెట్టింది. అయితే క్యాన్సర్ వదిలింది అనుకుంటే మరో సమస్య ఆమెపై దాడి చేసింది. మమతా ఆటో ఇమ్యూన్ కి గురయ్యారు. అది బొల్లి వ్యాధికి దారి తీసింది. తాను బొల్లి వ్యాధికి గుర‌య్యాను అంటూ మ‌మ‌తా స్వ‌యంగా బ‌య‌ట‌పెట్టింది. హీరోయిన్స్ త‌మ అందాన్ని ప్రాణం కంటే ఎక్కువ‌గా ప్రేమిస్తారు. అలాంటి వారికి బొల్లి వ్యాధి వ‌స్తే ఇక బాధ వ‌ర్ణనాతీతం.

తాజాగా త‌న వ్యాధి గుర్తించి మమ‌తా మాట్లాడింది. `ఓ సినిమా షూటింగ్ టైం లో ఒంటి పై మచ్చలు గమనించాను. అవి ముఖం, చేతులు, మెడపై వ్యాపించాయి. పరీక్షల్లో బొల్లి వ్యాధి అని తేలింది. క్యాన్సర్ సోకినప్పుడు అందరూ నాకు మద్దతిగా నిలిచారు. కానీ, ఈ వ్యాధి గురించి బయట పెట్టలేకపోయాను. ఒంటరిని అయ్యాను. ఒక్కదాన్నే కూర్చొని ఎన్నో రోజులు ఏడ్చాను. మెడిసిన్ వాడుతుంటే ఊపిరితిత్తుల సమస్య వచ్చింది. దీంతో మందులు తగ్గించాను. ఎప్పుడూ కెమెరా ముందు ఉండే నేను ఒంటరితనాన్ని భరించలేకపోయాను. చనిపోతానేమో అన్న భయం వేసింది. వెంటనే నాకు సోకిన బొల్లి వ్యాధి గురించి అందరికీ తెలిసేలా చేశాను. అప్పుడు కొంత ప్రశాంతంగా అనిపించింది` అంటూ చెప్పుకొచ్చింది.