ఎమ్మెల్సీల్లో బీసీ మంత్రం..ఓట్లు రాలుతాయా?

ఒకప్పుడు బీసీ వర్గాలు టీడీపీకి అండగా ఉన్న విషయం తెలిసిందే. అసలు బీసీలంటే టీడీపీ..టీడీపీ అంటే బీసీలు అనే పరిస్తితి ఉండేది. అలా బీసీలు మెజారిటీ సంఖ్యలో టి‌డి‌పికి ఓటు వేశారు. కానీ 2019 ఎన్నికల్లో సీన్ మారింది. చంద్రబాబు కాపు రిజర్వేషన్ల పేరుతో కాపుల వైపు మొగ్గు చూపడంతో..టీడీపీకి బీసీలు దూరం జరిగారు. ఇటు జగన్‌కు సపోర్ట్ గా నిలిచారు. మెజారిటీ బీసీలు వైసీపీకి ఓటు వేశారు.

అప్పటినుంచి బి‌సిలని ఆకర్షించాలనే జగన్ ప్లాన్ ఉంటుంది. అసలు టి‌డి‌పి వైపుకు వెళ్లకుండా  బి‌సిలు వైసీపీ ఉండేలా వ్యూహాలు రచిస్తూ వచ్చారు. ఇదే క్రమంలో బీసీల్లో ఒక్కో కులానికి ఒక్కో కార్పొరేషన్‌ని ఏర్పాటు చేసి..ఛైర్మన్‌లని నియమించారు. అలాగే స్థానిక సంస్థల పదవుల్లో బి‌సిలకు ప్రాధాన్యత ఇచ్చారు. బి‌సిల పేరిట సదస్సులు పెడుతూ వచ్చారు. ఇలా బి‌సిలని ఆకట్టుకోవడమే లక్ష్యంగా జగన్ పావులు కదిపారు. ఈ క్రమంలోనే తాజాగా ఖాళీ అయిన 18 ఎమ్మెల్సీ స్థానాలని జగన్ భర్తీ చేశారు. 18 స్థానాల్లో 11 స్థానాలు బి‌సిలకే కేటాయించారు. అంటే బి‌సిల ఓట్లు కొల్లగొట్టేందుకు జగన్ ఈ తరహా ఎత్తు వేశారని చెప్పవచ్చు.

స్థానిక సంస్థల కోటా

నర్తు రామారావు-యాదవ (శ్రీకాకుళం)

కుడిపూడి సూర్యనారాయణ-శెట్టిబలిజ (తూర్పుగోదావరి)

వంకా రవీంద్రనాథ్‌-కాపు (పశ్చిమగోదావరి)

కవురు శ్రీనివాస్‌-శెట్టిబలిజ (పశ్చిమగోదావరి)

మేరుగు మురళీధర్‌-మాల (శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు)

సిపాయి సుబ్రహ్మణ్యం-వన్నెరెడ్డి (చిత్తూరు)

పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి-రెడ్డి (కడప)

ఎ.మధుసూదన్‌-వాల్మీకి బోయ (కర్నూలు)

ఎస్‌.మంగమ్మ-వాల్మీకి బోయ (అనంతపురం)

ఎమ్మెల్యేల కోటా

పెన్మత్స సూర్యనారాయణరాజు-రాజు (విజయనగరం)

పోతుల సునీత-పద్మశాలి (బాపట్ల)

కోలా గురువులు-బలిజ (విశాఖపట్నం)

బొమ్మి ఇజ్రాయల్‌-మాదిగ (బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ)

జయమంగళ వెంకటరమణ-వడీలు (ఏలూరు)

చంద్రగిరి ఏసురత్నం-వడ్డెర (గుంటూరు)

మర్రి రాజశేఖర్‌-కమ్మ (పల్నాడు)

గవర్నర్‌ కోటా

కుంభా రవిబాబు-ఎరుకల (అల్లూరి సీతారామరాజు)

కర్రి పద్మశ్రీ-వాడ బలిజ (మత్స్యకార) (కాకినాడ)

వీటిల్లో బి‌సిలకు 11, ఓసీలకు 4, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1 ఎమ్మెల్సీ ఇచ్చారు. అంటే బి‌సిలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అర్ధం చేసుకోవచ్చు. అయితే బి‌సి ప్రజలకు అందరితో పాటు వచ్చే పథకాల తప్ప ప్రత్యేకంగా ఒరిగేది ఉండటం లేదు. అలాంటప్పుడు ఇలా పదవులు ఇవ్వడం వల్ల బి‌సిల ఓట్లు రాలుతాయా? అంటే చెప్పడం కష్టమే. చూడాలి మరి ఈ సారి బి‌సి ఓట్లు వైసీపీకి ఏ స్థాయిలో పడతాయో.