వెల్లంపల్లికి హ్యాండ్..వైసీపీలోకి కొత్త నేత ఎంట్రీ?

విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో కొత్త ట్విస్ట్ వచ్చింది..అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా ఉండే ఆకుల శ్రీనివాస్‌ని జగన్ వైసీపేలో చేర్చుకున్నారు. దీంతో వెస్ట్ సీటులో గాని ట్విస్ట్ లు ఉన్నాయనే చర్చ నడుస్తోంది. నెక్స్ట్ ఎన్నికల్లో వెల్లంపల్లి సీటుకు ఎసరు పెడతారనే చర్చలు నడుస్తున్నాయి. ప్రజారాజ్యంలో రాజకీయ జీవితం మొదలుపెట్టిన వెల్లంపల్లి..2009లో వెస్ట్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ప్రజారాజ్యం..కాంగ్రెస్ లో విలీనమైంది. దీంతో కొన్ని రోజులు కాంగ్రెస్ లో పనిచేశారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో..2014 ఎన్నికల ముందు బి‌జే‌పిలో చేరి..టి‌డి‌పితో పొత్తులో భాగంగా వెస్ట్ నుంచి పోటీ చేసి స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయారు. ఇక ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. అలాగే మంత్రి పదవి ఛాన్స్ కూడా కొట్టేశారు. కానీ మంత్రిగా సక్సెస్ కాలేదు. పెద్ద ఎత్తున ఆరోపణలు మూటగట్టుకున్నారు. ఇక ఎమ్మెల్యేగా పెద్దగా సక్సెస్ అయినట్లు కనిపించడం లేదు. పైగా వచ్చే ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేన పొత్తు ఉండవచ్చు అని ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే వెస్ట్‌లో వెల్లంపల్లికి చెక్ పడే అవకాశాలు ఉన్నాయి.

ఇదే సమయంలో 2014లో వెస్ట్ నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఆకుల శ్రీనివాస్ ఓటమి పాలయ్యారు. ఆయన కొన్ని ఓట్లు చీల్చడం వల్లే..అప్పుడు తాను ఓడిపోయాననే అసంతృప్తి వెల్లంపల్లికి ఉంది. అయితే శ్రీనివాస్‌ని ఇటీవల జగన్ వద్దకు జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను తీసుకెళ్లారు. దీంతో వెల్లంపల్లి, ఉదయభానుల ప్రత్యక్షంగా తిట్టుకున్న విషయం తెలిసిందే.

ఇదే తరుణంలో ఆకుల శ్రీనివాస్ ఇప్పుడు వైసీపీలో చేరారు. ఈ అంశంపై వెల్లంపల్లి అసంతృప్తిగా ఉన్నారు. మరి శ్రీనివాస్‌తో వెల్లంపల్లికి చెక్ పెడతారనే కథనాలు వస్తున్నాయి. చూడాలి మరి వెస్ట్ లో ఏ ట్విస్ట్ వస్తుందో.