చింతలపూడి సీటు రేసులో యువనేత..ఫిక్స్?

తెలుగుదేశం పార్టీకి ఇంచార్జ్ లేని సీట్లలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడి కూడా ఒకటి. ఈ సీటులో ఇంచార్జ్ లేరు. గత ఎన్నికల్లో టి‌డి‌పి తరుపున కర్రా రాజారావు పోటీ చేసి ఓడిపోయారు. ఆయన అనారోగ్యంతో చనిపోవడంతో..చింతలపూడి సీటు ఖాళీగా ఉంది. కానీ ఈ సీటు దక్కించుకోవడం కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నారు. ఇదే క్రమంలో మాజీ మంత్రి పీతల సుజాత..మొదట నుంచి చింతలపూడి సీటుపై ఆశలు పెట్టుకుని ఉన్నారు.

అటు మరో నలుగురు నేతలు చింతలపూడి రేసులో ఉన్నారు.  మాజీ జెడ్పీ ఛైర్మన్ కొక్కిరిగడ్డ జయరాజు, జంగారెడ్డిగూడెం టౌన్‌కు చెందిన పారిశ్రామికవేత్త ఆకుమర్తి రామారావు, మిషన్ హోప్ సంస్థ స్థాపకులు సొంఘా రోషన్, ఎన్‌ఆర్‌ఐ బొమ్మాజీ అనిల్…ఈ నలుగురు ఇప్పుడు చింతలపూడి సీటు రేసులో ఉన్నారు. ఎవరికి వారు సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో టి‌డి‌పి అధిష్టానం మాత్రం అనిల్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

అయితే అనిల్ ఎన్‌ఆర్‌ఐ అయినప్పటికి..ఆయన ఫ్యామిలీ మూలాలు చింతలపూడిలోనే ఉన్నాయి. ఈయన పశ్చిమగోదావరి జిల్లా మాజీ కలెక్టర్‌గా పనిచేసిన దివంగత బొమ్మాజీ దానం కుమారుడు, అలాగే సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత టీడీపీ ఇన్చార్జ్ బీఎన్ విజయ్ కుమార్ సోదరుడు. దీంతో చింతలపూడిలో అనిల్‌కు అన్నీ దార్లు తెరిచి ఉన్నాయి. పైగా కొవ్వూరు, గోపాలాపురం ఎస్సీల్లో మాదిగ వర్గానికి కేటాయిస్తున్నారు.

దీంతో చింతలపూడి సీటు మాల వర్గానికి ఇవ్వాల్సిందే. మొదట నుంచి అదే వర్గానికి సీటు ఇస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు బి. అనిల్‌కు చింతలపూడి సీటు ఇస్తారని తెలుస్తోంది. అటు ఆర్ధికంగా కూడా అనిల్ స్ట్రాంగ్ గా ఉన్నారు. దీంతో చింతలపూడి సీటు గెలుస్తామనే ధీమాలో ఉన్నారు. చూడాలి మరి చింతలపూడి సీటు అనిల్‌కే దక్కుతుందో లేదో.