నందమూరి తారకరత్న ఇక లేరు, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు అన్న సంగతి తెలిసిందే. తారకరత్న పార్థివదేహాన్ని ఈ రోజు ఉదయం మోకిల నుంచి ఫిల్మ్ ఛాంబర్ కు తరలించారు. సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీంతో తారకరత్నను కడసారి చూసేందుకు అభిమానులు తరలివస్తున్నారు.
తారకరత్న భౌతికకాయానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. తారకరత్న మరణంతో ఆయన భార్య అలేఖ్యా రెడ్డి, ముగ్గురు పిల్లలు ఒంటరి వారైపోయారు. ఈ నేపథ్యంలోనే బాలయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారట. తారకరత్న భార్య, ముగ్గురు పిల్లల బాధ్యత తాను తీసుకుంటానని.. తారక్ కుటుంబానికి నిత్యం అండగా ఉంటానని భరోసా ఇచ్చారట. ఈ విషయాన్ని ఎంపీ విజయ్ సాయి రెడ్డి స్వయంగా వెల్లడించారు.
కాగా, బాలయ్య-తారకరత్న మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది. తారకరత్న తన తండ్రి కంటే ఎక్కువ బాలయ్యను ప్రేమించాడు. బాలయ్య కూడా తన సొంత బిడ్డలా తారకరత్నను చూసుకున్నాడు. తారకరత్న అనారోగ్యానికి గురి కావడంతో బాలయ్య తల్లడిల్లిపోయారు. కొడుకు హాస్పటల్ లో ఉన్న అన్ని రోజులు బాలయ్యే అన్ని వ్యవహారాలు చూసుకున్నారు. నిత్యం మెరుగైన వైద్యం అందేలా చూస్తూ తారకరత్నను కాపాడుకునేందుకు ఎంతో ప్రయత్నించారు. కానీ, ఆ దేవుడు కరుణించలేదు. ఇక ఇప్పుడు తారకరత్న చివరి కార్యక్రమాల్లోనూ బాలయ్యనే దగ్గరుండి చూసుకుంటున్నారు.