రిజర్వడ్ స్థానాల్లో టీడీపీకి కమ్మని దెబ్బ..!

రాష్ట్రంలో రిజర్వడ్ స్థానాల్లో మొదట నుంచి టీడీపీ బలం తక్కువనే చెప్పాలి. ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో మొదట నుంచి కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ సత్తా చాటుతున్నాయి. గత ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. కేవలం ఒక ఎస్సీ స్థానంలో టీడీపీ, మరొక స్థానంలో జనసేన గెలిచింది. కొండపిలో టీడీపీ, రాజోలులో జనసేన గెలిచింది. జనసేన ఎమ్మెల్యే తర్వాత వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు. దీంతో రిజర్వడ్ స్థానాల్లో వైసీపీ హవానే ఉంది.

అయితే ఈ సారి వైసీపీకి చెక్ పెట్టాలని టీడీపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది..అదే సమయంలో కొన్ని స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు…కొందరిపై వ్యతిరేకత ఉంది. అలా అని ఆ స్థానాల్లో టీడీపీకి అడ్వాంటేజ్ అవుతుందనుకుంటే పొరపాటే. ఎందుకంటే వైసీపీ వ్యతిరేకతని ఉపయోగించుకుని బలపడటంలో టీడీపీ విఫలమవుతుంది. పైగా కొన్ని స్థానాల్లో ఆధిపత్య పోరు ఉంది.

ఇంకా విచిత్రంగా టీడీపీలో డామినేషన్ చేసే కమ్మ వర్గం వల్ల కొన్ని స్థానాల్లో టీడీపీకి నష్టం జరుగుతుంది. అనేక ఎన్నికల నుంచి టీడీపీ ఓడిపోవడానికి కమ్మ వర్గం కారణం అవుతుంది.  కమ్మ వర్గం వల్ల టీడీపీ దెబ్బతింటున్న ఎస్సీ స్థానాలు వచ్చి..రైల్వేకోడూరు, సంతనూతలపాడు, పామర్రు, తిరువూరు, కొవ్వూరు, చింతలపూడి, నందిగామ లాంటి స్థానాలు ఉన్నాయి.

వీటిల్లో కొవ్వూరు, చింతలపూడి, నందిగామ స్థానాలు టీడీపీకి కంచుకోటలు..2014 ఎన్నికల్లో ఈ మూడు చోట్ల టీడీపీ గెలిచింది..కానీ 2019లో ఓటమి పాలైంది. అయితే ఇప్పటికీ ఆ స్థానాల్లో టీడీపీ పికప్ అవడం లేదు. ఇందులో నందిగామ పర్లేదు గాని..చింతలపూడి, కొవ్వూరుల్లో పార్టీ పరిస్తితి బాగోలేదు. కమ్మ వర్గం అంతర్గత రాజకీయం టీడీపీని దెబ్బతీస్తుంది.

ఇక ఎన్టీఆర్ పుట్టిన గడ్డ పామర్రులో టీడీపీ ఇంతవరకు గెలవలేదు..పోనీ ఈ సారైనా అక్కడ గెలుస్తుందా? అంటే ఆ పరిస్తితి కనిపించడం లేదు. ఇక్కడ కూడా ఎస్సీ నేత గెలిస్తే తమ పెత్తనం పోతుందని కమ్మ వర్గం ఇంటర్నల్‌గా దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. రైల్వేకోడూరు, సంతనూతలపాడు, తిరువూరు స్థానాల్లో అదే పరిస్తితి.