చిక్కుల్లో ప‌డ్డ స‌మంత‌.. రూ. 5 కోట్ల ప‌రువు న‌ష్టందావా!

మయోసైటిస్ అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న సమంత ప్రస్తుతం ఇంటికి పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ బ్యూటీకి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రీసెంట్గా ఈ బ్యూటీ `యశోద` మూవీ తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. హరిశంకర్, హరీష్ నారాయన్ దర్శకులుగా వ్యవహరించిన ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీ బ్యాన‌ర్ పై శివలెంక‌ కృష్ణ ప్రసాద్‌ దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.

నవంబర్ 11న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది .సరోగసి నేపథ్యంలో సాగిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని అదిరిపోయే వసూళ్లను రాబట్టింది. ఇక అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో యశోద సినిమాతో తమ సంస్థ బ్రాండ్‌ ఇమేజ్ దెబ్బతిందంటూ సమంతతో సహా దర్శక నిర్మాతలపై ఇవా ఐవీఎఫ్‌ ఎండి మోహన్ రావు ఆరోపించారు.

గురువారం మీడియాతో మాట్లాడిన మోహన్ రావు.. యశోద సినిమాలో సరోగసి స్కాంను వెలికి తీసే దృశ్యాల్లో తమ సమస్త పేరును వాడుకుని తప్పు చేశారు. ఎటువంటి పర్మిషన్ లేకుండా సినిమాలో ఇవా ఐవీఎఫ్ పేరును పలుచోట్ల ప్రస్తావించడంతో పాటు దృశ్యాల్లోనూ ఆసుపత్రిని చూపించారు. దీని కారణంగా మా సంస్థ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తిన్న‌ది అంటూ ఆయన ఆరోపించారు. అలాగే నిర్మాత శివలెంక‌ కృష్ణ ప్రసాద్, దర్శకులు హరి-హరీష్ మరియు సమంతలపై రూ. 5 కోట్ల పరువు నష్టందావా వేసినట్లు వెల్లడించారు. మరి ఈ వివాదం పై చిత్ర టీం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.