మోదీ-పవన్ భేటీ..పోలిటికల్ ట్విస్ట్ స్టార్ట్…!

మొత్తానికి ప్రధాని మోదీతో చాలా కాలం తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. తాజాగా విశాఖ పర్యటనకు వచ్చిన మోదీ..మొదట రోడ్ షో ద్వారా చోళ సూట్‌కు చేరుకుని, అక్కడ రాష్ట్ర బీజేపీ నేతలతో భేటీ అయ్యి, పార్టీ పరిస్తితిని అడిగి తెలుసుకున్నారు. తర్వాత పవన్‌తో వన్ టూ వన్ భేటీ అయ్యారు. ఈ భేటీపై రాష్ట్ర మొత్తం ఆసక్తిగా ఎదురుచూసింది.

ఈ భేటీలో ఏం చర్చకు వస్తుంది..పొత్తుల గురించి మాట్లాడతారా, జగన్‌పై పోరుకు బీజేపీతో కలిసి పవన్‌ని పోరాటదనికి సిద్ధమవ్వాలని చెప్పారా? అసలు ఏం చర్చకు వచ్చిందనేది క్లారిటీ రాలేదు. కానీ సమావేశం అయ్యాక పవన్ బయటకొచ్చి..పి‌ఎం‌ఓ నుంచి ఆహ్వానం రావడంతోనే..మోదీని కలిశానని, ఏపీలో ఉన్న పరిస్తితులని ఆయనకు వివరించానని, ఏపీ ప్రజలు చాలా ఆనందంగా ఉండాలని, రాష్ట్ర అభివృద్ధి జరగాలని, దానికోసం కృషి చేస్తానని మోదీ తనతో చెప్పారని అన్నారు. ఇంకా మీడియా నుంచి ప్రశ్నలు వస్తున్న నేపథ్యంలో తర్వాత చెప్తానని పవన్ వెళ్ళిపోయారు.

అయితే భేటీలో అసలు ఇంకా ఏం చర్చకు వచ్చాయనే అంశాలపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఆలయాలపై దాడులు, ఇళ్ళు కూల్చివేత, ప్రతిపక్షాలని టార్గెట్ చేయడం, ఆర్ధికంగా రాష్ట్రాన్ని దెబ్బతీయడం లాంటి అంశాలని పవన్..మోదీకి వివరించి ఉంటారని సమాచారం. ఇక పొత్తు గురించి చర్చకు వచ్చిందనేది క్లారిటీ లేదు. ఎలాగో బీజేపీతో పవన్ పొత్తులో ఉన్నారు.

కానీ ఇటీవల చంద్రబాబు వచ్చి పవన్‌ని కలిశారు. దీంతో పవన్..టీడీపీతో కలుస్తారని ప్రచారం మొదలైంది. ఇదే క్రమంలో టీడీపీతో కలిసి వెళ్ళడంపై మోదీతో పవన్ చర్చించారా? అనేది క్లారిటీ లేదు. కాకపోతే జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తే పది సీట్లు కూడా రావడం కష్టమనే అంశం తెలిసింది. టీడీపీతో కలిస్తే అడ్వాంటేజ్ ఉంటుంది. ఇటు టీడీపీ కైనా వైసీపీని ఎదుర్కోవాలంటే జనసేన సపోర్ట్ తప్పనిసరి. ఈ రాజకీయ సమీకరణాల గురించి పవన్..మోదీతో చర్చించారో కూడా తెలియదు. మొత్తానికి మోదీతో పవన్ భేటీ అనేది ఏపీ రాజకీయాల్లో పెద్ద ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు.