వైసీపీకి ఐప్యాక్ గుడ్‌బై..న్యూ స్ట్రాటజిస్ట్ ఎంట్రీ?

రాష్ట్రం విడిపోయాక ఏపీలో పాగా వేసేది ఎవరు అనే అంశంపై 2014 ఎన్నికల ముందు పెద్ద ట్విస్ట్‌లు నడిచిన విషయం తెలిసిందే. అయితే 2012 ఉపఎన్నికల్లో ఊహించని విధంగా గెలిచిన జగన్ పెట్టిన వైసీపీ..2014లో కూడా సత్తా చాటి అధికారంలోకి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఏడాదిన్నరలోనే చంద్రబాబు రాజకీయాన్ని మార్చేసి…టీడీపీకి అనుకూల వాతావరణం తీసుకొచ్చి..2014లో అధికారంలోకి వచ్చారు.

అంటే చంద్రబాబు రాజకీయ చాతుర్యం ఎలా ఉంటుందో దాని బట్టి అర్ధమవుతుంది. అందుకే బాబు లాంటి చతురత కలిగిన నాయకుడుకు చెక్ పెట్టాలంటే..సమర్ధవంతమైన వ్యూహకర్త కావాలని భావించి జగన్..ప్రశాంత్ కిషోర్‌ని పెట్టుకున్నారు. ఇక పీకే వ్యూహాలు ఏ విధంగా నడిచాయో అందరికీ తెలిసిందే..ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా, కులాల మధ్య చిచ్చు పెట్టడం..ఇలా రకరకాల రాజకీయ ఎత్తుగడలతో చంద్రబాబుకు చెక్ పెట్టి..2019లో జగన్‌ని భారీ మెజారిటీతో గెలిపించారు. అలా పీకేతో జగన్ విజయం సాధించారు.

ఇక మరోసారి అధికారంలోకి రావాలని చెప్పి అదే పీకే టీంని జగన్ నమ్ముకున్నారు. పీకే వ్యూహకర్తగా తప్పుకున్నా సరే..ఆయన టీం అయిన ఐప్యాక్..వైసీపీ కోసం పనిచేస్తూనే వచ్చింది. అయితే తాజాగా ఓ సెన్సేషనల్ అంశం బయటకొచ్చింది. గత నెల దీపావళితో ఐప్యాక్ టీం …వైసీపీతో ఒప్పందాన్ని ముగించుకుందట. మళ్ళీ వారితో ఒప్పందం పెట్టుకోలేదని తెలిసింది. దీపావళి వరకు రాష్ట్రంలో ఉన్న పరిస్తితులని జగన్‌కు వివరించి..ఐప్యాక్ టీం సైడ్ అయిందని తెలిసింది.

అయితే ఐప్యాక్ టీం తప్పుకోవడంతో..మరో వ్యూహకర్తతో ఒప్పందం పెట్టుకునేందుకు జగన్ సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతుంది. అది కూడా గతంలో ఐప్యాక్ టీంలో పనిచేసిన వ్యక్తిని..వ్యూహకర్తగా నియమించుకునేందుకు సిద్ధమయ్యారట. ఎలాగో ప్రశాంత్ కిషోర్ సెపరేట్ గా రాజకీయం చేస్తున్నారు. ఆ టీంలో మరో వ్యక్తి అయిన రాబిన్ శర్మ..టీడీపీకి వ్యూహకర్తగా ఉన్నారు. టీంలో పనిచేసిన సునీల్ కానుగోలు..తెలంగాణలో కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నారు. అలా టీంలో పనిచేసిన మరో వ్యక్తితో  వైసీపీ ఒప్పందం కుదుర్చుకోవచ్చని సమాచారం.