స‌మంత ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్‌.. త్వ‌రలోనే స‌ర్‌ప్రైజ్‌!

ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల `యశోద` మూవీతో ప్రేక్షకుల‌ను పలకరించిన సంగతి తెలిసింది. హరి-హరీష్‌ ద్వయం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. నవంబర్ 11న తెలుగుతో పాటు త‌మిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచే హిట్ టాక్‌ను అందుకుంది.

నటన మరియు యాక్షన్ సన్నివేశాల్లో సమంత అద‌ర‌గొట్టేసిందంటూ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఇక టాక్ అనుకూలంగా ఉండడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వ‌సూళ్ల‌ను రాబడుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా సమంత ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యే ఓ గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే.. యశోదకు సీక్వెల్ రాబోతోందట. దర్శకులు హరి-హరీష్‌ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

సీక్వెల్ కు సంబంధించిన ఐడియాను సిద్ధం చేసినట్లుగా పేర్కొన్న ద‌ర్శ‌కులు.. ఫ్రాంచైజ్ మాదిరిగా య‌శోద సినిమాను తెర‌కెక్కించాల‌నే ఆలోచ‌న ఉన్న‌ట్లు తెలిపారు. య‌శోద‌లో పోలీస్ ట్రైనింగ్‌ను కంప్లీట్ చేశాక అనివార్య కార‌ణాల జాబ్‌లో జాయిన్ కాలేక‌పోయిన‌ట్లుగా స‌మంత పాత్ర‌ను చూపించారు. అయితే సీక్వెల్‌లో సమంత పోలీస్ ఆఫీసర్ గా ప‌వ‌ర్ ఫుల్ రోల్ లో అల‌రించ‌బోతోందని తెలుస్తోంది. అంతేకాదు, య‌శోద సీక్వెల్‌పై త్వ‌ర‌లోనే ఓ స‌ర్‌ప్రైజింగ్ అనౌన్స్‌మెంట్ కూడా ఉంటుంద‌ట‌.