మునుగోడులో మహిళలు తమ శక్తిని ఓట్ల రూపంలో చాటే అవకాశం వచ్చిందా..? వీరి ఓట్లపై అన్ని పార్టీలు నమ్మకం పెట్టుకున్నాయా..? ముఖ్యంగా ఒక ప్రధాన పార్టీ అతివల ఓట్లతోనే గట్టెక్కగలమని భావిస్తోందా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మహిళలు ఓట్ల రూపంలో తమ చైతన్యాన్ని ప్రదర్శించాలని.. అదీ గంపగుత్తగా తమకే లాభించాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో ముందుగా నలిగిపోయేది.. విసిగిపోయేది అతివలే కనుక వారి తీర్పుపై ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అంత ధీమాగా ఉంది. ఎందుకంటే మహిళలు నిద్ర లేవగానే మొదటగా వంటింటి వైపు పరిగెత్తి సిలిండర్ ఆన్ చేయడం తెలిసిందే. గతంతో పోల్చితే గ్యాస్ ధర అధికంగా పెరగడం.. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీ వల్ల ఇతర నిత్యావసరాల ధరలు మండిపోవడం.. ఉప్పు, పప్పు దగ్గర నుంచి.. పసిపిల్లలు వాడే పాల డబ్బాల వరకు జీఎస్టీని మూడింతలు పెంచింది మోదీ సర్కార్. ఇందుకు కేసీఆర్ ప్రభుత్వం కూడా వంత పాడింది.
ఇవన్నీ గుర్తుకుతెచ్చుకొని ఆ రెండు పార్టీల వైపు మహిళామణులు కన్నెత్తి చూడరని.. అధిక శాతం ఓట్లు కాంగ్రెస్సే సాధిస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రతీ చోటా ప్రచారంలో ఈ విషయాలనే ప్రస్తావిస్తూ ఓట్లు అడుగుతున్నారు ఆ పార్టీ లీడర్లు. ముఖ్యంగా పార్టీ చీఫ్ రేవంత్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల వల్ల మహిళలకు జరుగుతున్న నష్టాన్ని నొక్కివక్కానిస్తున్నారు. ఆయన ప్రసంగం సూటిగా ఉండడంతో వారు కూడా ఆసక్తిగా వింటున్నారు.
అదీకాకుండా ఒక మహిళకు తమ పార్టీ టికెట్టు ఇచ్చిందని.. ములుగులో సీతక్కను సమ్మక్క వలే గెలిపించారని.. మునుగోడులో సారక్కను ఆశీర్వదించాలని కోరుతూ సెంటిమెంటు రగిల్చే ప్రయత్నాల్లో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పది మంది మహిళలు మంత్రులుగా ఉంటే.. టీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో అతివలే కరువయ్యారని.. మలి విడతలో కూడా ఒకరిద్దరికే అవకాశం ఇచ్చారని గుర్తు చేస్తున్నారు.
ఏ రకంగా చూసినా కాంగ్రెస్ తోనే మహిళలకు న్యాయం జరుగుతుందని తేల్చిచెబుతున్నారు. మొత్తం ఓటర్లలో 50 శాతానికి పైగా ఉన్న మహిళల ఓట్లలో బీజేపీ ఓటు బ్యాంకు కొంత పోగా.. టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి పింఛన్లు తీసుకుంటున్న మరికొంత మహిళలు పోగా.. మిగతా ఓట్లన్నీ తమకే పడాలని ఆ పార్టీ కోరుకుంటోంది. కాంగ్రెస్ లెక్కలు బాగానే ఉన్నాయి కానీ.. డబ్బు ప్రభావం చూపితే మాత్రం అంతా తలకిందులయ్యే ప్రమాదం ఉంది. చూడాలి మరి అతివల ఓట్లు ఎవరిని అందలం ఎక్కిస్తాయో..