ట్విస్ట్‌లో ట్విస్ట్: క్లైమాక్స్‌కు ‘కొనుగోలు’ కథ..!

అనూహ్యంగా తెలంగాణలో నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు అంటూ పెద్ద సంచలన రాజకీయ కథ నడిచిన విషయం తెలిసిందే. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో నేతల జంపింగులు పెరిగిన విషయం తెలిసిందే. అటు, ఇటు నేతలు మారిపోతున్నారు. అయితే బీజేపీకి చెక్ పెట్టేలా టీఆర్ఎస్..తమ పాత నాయకులని బీజేపీ నుంచి లాగేసుకునే కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికే కొందరు నాయకులు టీఆర్ఎస్‌లో చేరిపోయారు.

ఈ క్రమంలో బీజేపీ కాస్త సెల్ఫ్ డిఫెన్స్‌లో పడినట్లైంది. ఇదే క్రమంలో టీఆర్ఎస్‌కు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ నేతలు పదే పదే చెబుతూ వస్తున్నారు. ఇదే క్రమంలో టీఆర్ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలని బీజేపీ కొనుగోలు చేయడానికి రెడీ అయిందని, బీజేపీకి చెందిన ముగ్గురు వ్యక్తులు, టీఆర్ఎస్‌కు చెందిన బీరం హర్షవర్ధన్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజులతో బేరసారాలు కొనసాగించారని, దీనికి సంబంధించి ఆధారాలు కూడా దొరికాయని మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి.

ముందే పోలీసులతో చెప్పి బీజేపీ నేతలని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇరికించేలా చేశారని తెలిసింది. ఇక బేరసారాలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కున్న ముగ్గురు బీజేపీకి సంబంధించిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు..కానీ దీనికి సరైన ఆధారాలు లేకపోవడం వల్ల ఆ ముగ్గురుకు కోర్టు బెయిల్ కూడా ఇచ్చేసింది. అటు నలుగురు ఎమ్మెల్యేలు కేసీఆర్ ఆధ్వర్యంలో రహస్య ప్రదేశంలో ఉన్నారని తెలిసింది.

దీనిపై మొదట టీఆర్ఎస్ కాస్త హడావిడి చేసింది కానీ తర్వాత దీనిపై ఎవరు మాట్లాడలేదు. ప్రెస్ మీట్ లేదు. అటు బీజేపీ నేతలు మాత్రం ప్రెస్ మీట్లు పెట్టి ఇదంతా టీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా అని ఖండించారు. అయితే దీనిపై ఢిల్లీలోనే తేల్చుకోవడానికి కేసీఆర్ సిద్ధమయ్యారని తెలిసింది..ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతో సహ ఈ అంశాన్ని బయటపెట్టాలని చూస్తున్నారని తెలిసింది. ఈ కథకు క్లైమాక్స్ ఢిల్లీలోనే ప్లాన్ చేశారు.

కాకపోతే ఈ కొనుగోలు కేసులో డబ్బులు దొరకలేదు. అయినా ఈ సమయంలో నలుగురు ఎమ్మెల్యేలకు 400 కోట్లు పెట్టి కొనల్సిన అవసరం బీజేపీకి ఉంటుందా?  ఆ ఎమ్మెల్యేలకు అంత ప్రాధాన్యత కూడా లేదు. ఇంకా ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంది. ఈ టైమ్‌లో ఎమ్మెల్యేలని కోనాల్సిన అవసరం ఉంటుందా? అసలు ఇదంతా ఎవరి స్కెచ్? ఈ కొనుగోలు కథ ఏంటి అనేది క్లారిటీ రావడం లేదు.