బీజేపీ ప్రభుత్వాన్ని, మోడీ పాలనను ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారన్న సంగతి తెలిసిందే. హిందుత్వ ఎజెండాను మోస్తున్న బీజేపీ వ్యతిరేకిగా ముద్ర పడ్డ కేజ్రీవాల్…తాజాగా ఆ ముద్ర చెరిపేసేందుకు చేసిన ప్రకటన ఒకటి సంచలనం రేపుతోంది. ఇకపై భారత్ లో ముద్రించే కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి బొమ్మలు కూడా ముద్రించాలని కేజ్రీవాల్ చేసిన ప్రకటన హాట్ టాపిక్ గా మారింది.
ఇండోనేషియా ఒక ముస్లిం దేశం అని, అక్కడ కరెన్సీ నోట్లపై వినాయకుడి ఫొటో ఉందని కేజ్రీవాల్ గుర్తు చేశారు. అటువంటి సమయంలో మన దేశపు కరెన్సీ నోట్లపై వినాయకుడు, లక్ష్మీదేవి ఫొటోలు ముద్రిస్తే తప్పేంటని కేజ్రీ ప్రశ్నించారు. ఇకపై, ముద్రించబోయే కొత్త కరెన్సీ నోట్లపై ఆ రెండు ఫొటోలను ఒకవైపు, మహాత్ముడి ఫొటో మరొక వైపు ముద్రించవచ్చని కేజ్రీవాల్ క్రేజీ ఐడియా ఇచ్చారు. ఇక, ఈ వ్యవహారంపై ప్రధాని మోడీకి త్వరలో లేఖ కూడా రాస్తానని కేజ్రీవాల్ చెప్పారు.
కొత్త నోట్లపై ఆ రెండు ఫొటోలు కూడా ముద్రించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేజ్రీవాల్ కోరారు. కొన్ని సందర్భాల్లో ఎంత కష్టపడ్డా ఫలితం ఉండదని, ఆ సమయాల్లో దైవానుగ్రహం తోడైతే ఫలితం మారుతుందని కేజ్రీ అన్నారు. త్వరలో జరగబోయే ఢిల్లీలో సివిక్ పోల్స్ ,గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ రెడీ అని అన్నారు.
అయితే, హిందుత్వ ఎజెండాను భుజానికెత్తుకునేందుకు కేజ్రీ అడుగులు వేస్తున్నారని, ఇదంతా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే చేస్తున్నారని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. అయితే, బీజేపీ, మోడీలకు కేజ్రీవాల్ మాస్టర్ స్ట్ర్రోక్ ఇచ్చారని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.