ప్రకాశంలో సీట్లు ఫిక్స్..నలుగురికే డౌట్?

వరుసపెట్టి నియోజకవర్గాల వారీగా చంద్రబాబు…తెలుగుదేశం అభ్యర్ధులని ఫిక్స్ చేసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటినుంచే బాబు..అభ్యర్ధులని ఖరారు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు అభ్యర్ధులని ఖరారు చేశారు. నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేసేది మీరే అంటూ కొన్ని స్థానాల్లో నేతలకు క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో ఇటీవల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్ళీ సీట్లు అని బాబు ప్రకటించారు.

ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లాలో ఉన్న 12 సీట్లలో దాదాపు…టీడీపీ అభ్యర్ధులు ఖరారైనట్లు కనబడుతోంది. ఎలాగో సిట్టింగులకు సీట్లు అన్నారు. కాబట్టి అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్, పర్చూరులో ఏలూరి సాంబశివరావు, కొండపిలో బాలవీరాంజనేయస్వామి పోటీ చేయడం ఖాయం. ఇక ఇంచార్జ్‌ల విషయానికొస్తే..కనిగిరిలో ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పోటీ చేయడం ఖాయమైంది. ఒంగోలులో దామచర్ల జనార్ధన్, మార్కాపురంలో కందుల నారాయణరెడ్డి, సంతనూతలపాడులో బి‌ఎన్ విజయ్ కుమార్, గిద్దలూరులో అశోక్ రెడ్డి పోటీ కూడా దాదాపు ఖాయమే. అంటే దాదాపు 8 సీట్లు ఫిక్స్ అయిపోయాయి.

కానీ నాలుగు సీట్లు విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. దర్శిలో టీడీపీ ఇంచార్జ్ పదవి నుంచి పమిడి రమేశ్ తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సీటు వైసీపీ నుంచే వచ్చే ఓ కీలక నేతకు ఇస్తారని అంతర్గతంగా టాక్ నడుస్తోంది. ఇది ఎంతవరకు నిజమవుతుందో క్లారిటీ లేదు. అటు చీరాలలో ఎం‌ఎం కొండయ్య, కందుకూరులో ఇంటూరి నాగేశ్వరరావు, ఎర్రగొండపాలెంలో ఎరిక్షన్ బాబు ఇంచార్జ్‌లుగా ఉన్నారు.

అయితే వీరి పనితీరు పట్ల చంద్రబాబు పెద్దగా సంతృప్తి వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది. పైగా ఈ నియోజకవర్గాల్లో సీటు కోసం టీడీపీలో పోటీ ఉంది. ఎర్రగొండపాలెం సీటు కోసం ఎరిక్షన్ బాబుతో పాటు అజితా రావు…వైసీపీ నుంచి టీడీపీలోకి రావాలని చూస్తున్న డేవిడ్ రాజు కూడా పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. కందుకూరు సీటు కోసం ఇంటూరి, పోతుల రామారావుల మధ్య పోటీ ఉంది. జనసేనతో పొత్తు ఉంటే చీరాల సీటు ఆ పార్టీకి ఇచ్చేలా ఉన్నారు. మొత్తానికి ప్రకాశంలో నాలుగు సీట్లలో క్లారిటీ లేదు.