ప్రొద్దుటూరు సీటుపై తమ్ముళ్ళ రచ్చ..!

వచ్చే ఎన్నికల్లో ఖచితగా గెలవడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎప్పుడు ఎన్నికల ముందు వరకు అభ్యర్ధుల జోలికి వెళ్లని చంద్రబాబు…ఇప్పటినుంచే అభ్యర్ధులని ప్రకటించడంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. అయినా సరే బాబు ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో అభ్యర్ధులని ఖరారు చేసేశారు. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సైతం మళ్ళీ సీటు కన్ఫామ్ చేశారు.

ఇదే క్రమంలో రాయలసీమకు చెంది..డోన్ సీటుని సుబ్బారెడ్డికి, బనగానపల్లె సీటుని బీసీ జనార్ధన్ రెడ్డికి, మైదుకూరు సీటుని పుట్టా సుధాకర్ యాదవ్‌కు ఫిక్స్ చేశారు. ఈ క్రమంలోనే ప్రొద్దుటూరు సీటుని ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఫిక్స్ చేసినట్లు కథనాలు వస్తున్నాయి. కథనాలు రావడమే కాదు..తాజాగా ప్రొద్దుటూరు సీటు తనకే ఫిక్స్ అయిందని ప్రవీణ్..ప్రొద్దుటూరులో టీడీపీ కార్యకర్తలతో భారీ ర్యాలీ తీశారు. కేకు కటింగులు చేశారు. అంటే ఇంచార్జ్‌గా ఉన్న ప్రవీణ్‌కే సీటు ఫిక్స్ అయిందని ప్రచారం వచ్చేసింది.

కానీ ఈ వార్తని అదే నియోజకవర్గంలో ఉండే మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి ఖండిస్తున్నారు. ఇంకా చంద్రబాబు ప్రొద్దుటూరు సీటు ఎవరికి ఫిక్స్ చేయలేదని, ప్రవీణ్ మాత్రం తనకే సీటు అని హడావిడి చేస్తున్నారని, ర్యాలీలు తీసి, కేకు కటింగులు చేసినంత ఈజీగా సీటు రాదని ప్రవీణ్‌కు కౌంటర్ ఇచ్చారు. అలాగే అన్నిరకాలుగా పోటీ చేసే అర్హత తనకే ఉందని లింగారెడ్డి చెబుతున్నారు.

అయితే దశాబ్దాల కాలం నుంచి టీడీపీలో పనిచేస్తున్న లింగారెడ్డి..2009లో ప్రొద్దుటూరు నుంచి గెలిచారు. 2014లో లింగారెడ్డికి కాకుండా వరదరాజులు రెడ్డికి సీటు ఇచ్చారు. అయినా సరే లింగారెడ్డి పార్టీ కోసం పనిచేశారు. ఇక 2019లో పోటీ చేసి లింగారెడ్డి ఓటమి పాలయ్యారు. తర్వాత ప్రవీణ్ కుమార్ రెడ్డిని తీసుకొచ్చి ఇంచార్జ్ గా పెట్టారు. లింగారెడ్డిని కడప పార్లమెంట్ అధ్యక్షుడుగా పెట్టారు. కానీ ప్రొద్దుటూరు సీటు కోసం లింగారెడ్డి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఆ సీటు ప్రవీణ్‌కు ఫిక్స్ అని ప్రచారం జరుగుతుంది. దీంతో లింగారెడ్డి ఆ సీటు తనకే కావాలని పట్టుబడుతున్నారు. మొత్తానికి బలం ఉన్న ప్రొద్దుటూరు టీడీపీలో రచ్చ నడుస్తోంది.